Reading Time: 2 minutes
Nepal Rasuwa Flash Floods Bhotekoshi River 160 Dead 750 Missing

Nepal Floods: నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోషి నదికి వచ్చిన వినాశకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ విషాదకర ఘటనలో ఇప్పటివరకు సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 750 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రవాహ ఉధృతికి రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారం 35 ప్రధాన వంతెనలు, 45 సస్పెన్షన్ బ్రిడ్జిలు కొట్టుకుపోవడంతో అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి.

ఈ ప్రాణాంతక వరదల వల్ల 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎన్నో వాహనాలు నది ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు నేపాల్ సైన్యం 250 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అయితే ఇంకా వందలాది మంది జాడ తెలియాల్సి ఉంది. గల్లంతైన వారిలో 139 మంది భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు సమాచారం. వరదల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన ఒక బాధితుడు మాట్లాడుతూ.. “వరద ముంచెత్తడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంటి కప్పుపైకి ఎక్కాం. ఆ క్రమంలో నా భార్య ఇంట్లోని శిథిలాల కింద చిక్కుకుపోయింది. దాదాపు 4 నుంచి 5 గంటల నరకయాతన తర్వాత హెలికాప్టర్ ద్వారా నన్ను రక్షించారు” అని కన్నీటిపర్యంతమయ్యారు.

యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) విశ్లేషణ ప్రకారం… నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో చోటుచేసుకున్న భారీ కొండచరియలు విరిగిపడటమే ఈ విపత్తుకు కారణం. ఈ కొండచరియలు పడిన తీవ్రతకు 5.2 రిక్టర్ స్కేలు వద్ద సంభవించే భూకంపంతో సమానమైన ‘సీస్మిక్ సిగ్నల్స్’ నమోదయ్యాయి. ఓ మంచు కొండ (గ్లేషియర్) విరిగిపడి, దాంతో పాటు మంచు, రాళ్లు, బురద నీరు ఒక్కసారిగా భోటేకోషి ఉపనది అయిన ‘ల్హెండే ఖోలా’లోకి ప్రవహించడమే ఈ హఠాత్ వరదలకు ప్రధాన కారణమని భావిస్తున్నారు.

మరోవైపు.. నేపాల్‌లో పరిణామాలు దారుణంగా మారడంతో భారత ప్రభుత్వం, సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్ తీవ్ర అప్రమత్తమయ్యాయి. గండక్, నారాయణి, కోసి నదుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని మహారాజ్‌గంజ్, ఖుషీనగర్‌లతో పాటు బీహార్‌లోని సున్నితమైన సరిహద్దు జిల్లాలకు హోం మంత్రిత్వ శాఖ అలెర్ట్ జారీ చేసింది. బీహార్‌లోని 6 జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ఇప్పటికే.. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని బాలేన్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కష్ట సమయంలో భారత ప్రజలు తమ నేపాల్ సహోదరులకు అండగా ఉంటారని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ… భారత్ పంపిన HADR (మానవతా సహాయం, విపత్తు నివారణ) బృందాలు, అత్యవసర వైద్య సాయం ఇప్పటికే ఖాట్మండుకు చేరుకున్నాయని, మరిన్ని సహాయక చర్యలను విస్తరిస్తున్నామని వెల్లడించారు.