
Producer Deepti: ‘కికు చిరంజీవి’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత దీప్తి చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. తన సినిమాలో నటించిన హీరోయిన్ కాశిష్ ఖాన్ చివరి ప్రమోషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ నిర్మాత తీవ్ర ఆరోపణలు చేశారు. షూటింగ్ సమయంలోనూ, ప్రమోషన్స్ సమయంలోనూ ఆమె నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత దీప్తి మాట్లాడుతూ.. సదరు హీరోయిన్ను తాము తీసుకున్నప్పుడు ఆమె గతంలో రెండు తెలుగు సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని తెలిపారు. ఆమెకు మేనేజర్ కూడా లేకపోవడంతో తానే స్వయంగా మాట్లాడి సినిమాలో అవకాశం ఇచ్చానని చెప్పారు. తనకు మంచి పాత్ర, మంచి అవకాశం కావాలని ఆమె కోరిందని, స్టార్టింగ్ షెడ్యూల్స్లో ఆమె పనితీరు బాగానే ఉందని, అయితే ఓ అవుట్డోర్ షెడ్యూల్ పూర్తయ్యాక పరిస్థితులు మారాయని నిర్మాత ఆరోపించారు. చిన్న చిన్న డిమాండ్లు నెరవేర్చకపోతే మరుసటి రోజు షూటింగ్కు రానని చెప్పడం మొదలుపెట్టిందన్నారు. సినిమా చివరి రోజున ఓ చిన్న మాంటేజ్ షాట్ చేయాల్సి ఉండగా, పెండింగ్ పేమెంట్ ఇవ్వకపోతే క్యారవాన్ నుంచి దిగనని ఆమె చెప్పిందని తెలిపారు.
అయితే ఒప్పందం ప్రకారం ఆమెకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఎప్పటికప్పుడు చెల్లించామని నిర్మాత స్పష్టం చేశారు. చివరి షెడ్యూల్లో కూడా ఆమె కోరిన మొత్తాన్ని చెల్లించిన తర్వాతే షూటింగ్కు సహకరించిందని చెప్పారు. అయినప్పటికీ ప్రమోషన్స్ విషయంలో మరోసారి పేమెంట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఒప్పందం ప్రకారం ప్రమోషన్స్ పూర్తయిన తర్వాత సుమారు రూ.1.04 లక్షల మొత్తాన్ని చెల్లించాల్సి ఉందని నిర్మాత వెల్లడించారు. అయితే ప్రమోషన్స్కు హాజరయ్యే ముందే ఆ మొత్తాన్ని చెల్లించాలని హీరోయిన్ డిమాండ్ చేసిందని చెప్పారు. ఒప్పందంలో లేని అదనపు రోజుల పేమెంట్ కూడా కావాలని ఆమె అడిగిందని చెప్పుకొచ్చారు. తమ సినిమా చివరి ప్రమోషన్ ఈవెంట్కు తప్పకుండా హాజరు కావాలని కోరామని, ఈ కార్యక్రమం తర్వాత సినిమా ప్రమోషన్స్లో భాగంగా మరో ఈవెంట్ ఉండదని కూడా ముందుగానే చెప్పామని, అయినప్పటికీ ఆమె నుంచి స్పందన రాకపోవడంతో ఈ విషయాన్ని మీడియా ముందే చెప్పాల్సి వచ్చిందని నిర్మాత దీప్తి పేర్కొన్నారు.
అదే సమయంలో హీరోయిన్కు ఇవ్వాల్సిన పేమెంట్ను తాను స్వంతంగా ఉంచుకోబోనని ఆమె స్పష్టం చేశారు. తమ సినిమా హార్ట్కు సంబంధించిన స్టోరీతో రూపొందిన నేపథ్యంలో, ఆ మొత్తాన్ని తిరుపతిలో చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం వినియోగించే ఫండ్కు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమక్షంలోనే ఆ మొత్తాన్ని చెల్లించే విషయంపై కూడా చర్చ జరిగింది. ‘కికు చిరంజీవి’ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఈ నెల 28న విడుదల కానుంది. ఈ క్రమంలో నిర్వహించిన ప్రమోషన్ ఈవెంట్లో నిర్మాత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.