Reading Time: < 1 minute
Telugu Film Industry Theater Mafia Shiraz Mehdi Legal Notice Dil Raju Suresh Babu

Shiraz Mehdi: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దాలుగా నలుగురి చేతుల్లోనే నలుగుతున్నదని ఆరోపిస్తూ థియేటర్ల వ్యవస్థపై ఓ చిన్న సినిమా దర్శకుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ‘ఓ అందాల రాక్షసి’ చిత్ర దర్శకుడు, నటుడు షిరాజ్ మెహది న్యాయ పోరాటానికి దిగారు. ఏకంగా అగ్ర నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలకు ఫైనల్ లీగల్ నోటీసులు పంపించి సంచలనం సృష్టించారు. చిన్న సినిమాలను బతకనివ్వకుండా థియేటర్ల మాఫియా అడ్డుపడుతోందని ఆరోపిస్తూ.. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబులకు షిరాజ్ మెహది లీగల్ నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులైన భరత్ భూషణ్ (ప్రెసిడెంట్), నాగవంశీ(వైస్ ప్రెసిడెంట్), అశోక్ కుమార్ (సెక్రటరీ), ప్రసన్న కుమార్ (ట్రెజరర్) లకు సైతం ఫైనల్ నోటీసులు పంపారు.

థియేటర్ల కేటాయింపులో వివక్ష చూపుతున్న PVR INOX అధినేత అజయ్ బిజిలీ, మేనేజర్ మహేష్, అలాగే ఏసియన్ సినిమాస్ (Asian Cinemas) ఎండీ సునీల్ నారంగ్, మేనేజర్ ప్రశాంత్ లను కూడా ఆయన వదల్లేదు. నోటీసులకు స్పందించకపోతే వీరందరూ కోర్టు మెట్లు ఎక్కక తప్పదని హెచ్చరించారు. చిన్న సినిమాలకు తీరని అన్యాయం జరుగుతున్నా పెద్దలు ఎందుకు నోరు మెదపడం లేదని షిరాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద సినిమాలు విడుదలైతే అందులో కేవలం రెండు మూడు సినిమాలనే ప్రొజెక్ట్ చేస్తూ మిగతా 97 సినిమాలను కావాలనే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోదా, డబ్బు, పలుకుబడి ఉందన్న అహంకారంతో కొందరు మనిషిని మనిషిలా చూడటం లేదని, కోర్టుకు వెళితే డబ్బులు విసిరేసి బయటపడొచ్చన్న ధీమాలో ఉన్నారని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా ప్రెస్ మీట్లు పెట్టి మొత్తుకుంటున్నా.. కనీసం ఒక్కరు కూడా బయటకు వచ్చి సమాధానం చెప్పకపోవడం వెనుక ఎవరి అండ ఉందని ఆయన ప్రశ్నించారు. ఈ థియేటర్ల మాఫియా, చిన్న సినిమాల కష్టాలపై నేరుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి షిరాజ్ మెహది ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం తన ఫిర్యాదును, ఆధారాలను స్వీకరించిందని, త్వరలోనే ప్రభుత్వం నుంచి ఈ వ్యవహారంపై సానుకూల స్పందన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.