
Sanat Sangwan Dropped Duleep Trophy: రంజీ ట్రోఫీ 2025-26లో అదరగొట్టిన ఢిల్లీ ఓపెనర్ సనత్ సంగ్వాన్కు దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ఫైనల్లో అనూహ్య షాక్ తగిలింది. రంజీ సీజన్లో 14 ఇన్నింగ్స్ల్లో 828 పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన సనత్ సంగ్వాన్ను నార్త్ జోన్ ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకోలేదు. బెంగళూరులో వెస్ట్ జోన్తో జరుగుతున్న క్వార్టర్ఫైనల్లో సనత్ స్థానంలో యశ్ ధుల్ను కామ్రాన్ ఇక్బాల్తో కలిసి ఓపెనింగ్కు పంపారు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్లో ఆడే ధుల్ రంజీ సీజన్లో 381 పరుగులే చేశాడు. దీంతో సనత్ ఎంపికను పక్కన పెట్టడంపై ప్రశ్నలు మొదలయ్యాయి. నార్త్ జోన్ కోచ్ అజయ్ శర్మ, సహాయక కోచ్ సరందీప్ సింగ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ధుల్ క్వార్టర్ఫైనల్లో 26 బంతుల్లో తొమ్మిది పరుగులు చేసి తొలి రోజే పెవిలియన్ చేరాడు. దీంతో విమర్శలు మరింత పెరిగాయి.
దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తున్న ఆటగాడికి పెద్ద టోర్నీలో చోటు దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో సనత్ సంగ్వాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఢిల్లీ తరపున 14 ఇన్నింగ్స్ల్లో 828 పరుగులు సాధించాడు. ఆ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రవిచంద్రన్ స్మరణ్ (950), ఆయుష్ దోసెజా (949) తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. అలాంటి ఆటగాడిని దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ఫైనల్లో నార్త్ జోన్ పక్కన పెట్టడం ఇప్పుడు ప్రశ్నలకు దారితీసింది.
సనత్కు బదులు యశ్ ధుల్..
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో ఆదివారం నుంచి వెస్ట్ జోన్, నార్త్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్ ప్రారంభమైంది. నార్త్ జోన్ తుది జట్టులో సనత్ సంగ్వాన్కు చోటు దక్కలేదు. స్పెషలిస్ట్ ఓపెనర్ అయిన సనత్ స్థానంలో యశ్ ధుల్ను కామ్రాన్ ఇక్బాల్తో కలిసి ఓపెనింగ్కు ఎంపిక చేశారు. యశ్ ధుల్ ప్రధానంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా ఆడతాడు. అంతేకాకుండా 2025-26 రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన కూడా సనత్తో పోలిస్తే అంతగా ఆకట్టుకోలేదు. ధుల్ ఆ సీజన్లో 381 పరుగులు చేశాడు.
26 బంతుల్లో 9 పరుగులకే..
సనత్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన యశ్ ధుల్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. వెస్ట్ జోన్ పేసర్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పృథ్వీ షాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ధుల్ 26 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు చేశాడు. దీంతో సనత్ సంగ్వాన్ను ఎందుకు పక్కన పెట్టారన్న చర్చ ఊపందుకుంది.
కోచ్లదే తుది నిర్ణయం..
జోనల్ మ్యాచ్ల్లో ప్లేయింగ్ ఎలెవన్ ఎంపిక కోచ్ల పరిధిలోనే ఉంటుందని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కార్యదర్శి అశోక్ శర్మ తెలిపారు. నార్త్ జోన్కు అజయ్ శర్మ ప్రధాన కోచ్గా, సరందీప్ సింగ్ సహాయక కోచ్గా వ్యవహరిస్తున్నారు. సనత్ను ఎందుకు ఎంపిక చేయలేదో, యశ్ ధుల్ను ఎందుకు ఆడించారో తాము చెప్పలేమని అశోక్ శర్మ పేర్కొన్నట్లు PTI తెలిపింది.
ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
జోనల్ టోర్నీల ఎంపికపై కొత్త ప్రశ్నలు..
సనత్ సంగ్వాన్ వంటి ఆటగాడిని పక్కన పెట్టడంతో జోనల్ టోర్నీలకు జట్ల ఎంపిక విధానంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జోనల్ టోర్నమెంట్లకు స్క్వాడ్ ఎంపిక బాధ్యతను బీసీసీఐ జాతీయ సెలెక్టర్లకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలా? అనే చర్చ మొదలైంది. రంజీ ట్రోఫీలో 828 పరుగులతో దేశవ్యాప్తంగా మూడో అత్యధిక స్కోరర్గా నిలిచిన సనత్కు దులీప్ ట్రోఫీ క్వార్టర్ఫైనల్లో తుది జట్టులో చోటు దక్కకపోవడం ఈ చర్చకు ప్రధాన కారణంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..