
OTR: ఆ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు.. మంత్రి కానీ మంత్రి. క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్లేందుకు అవకాశం.. ఇలా కీలక పదవిలో ఉన్నా.. ఆయనకు మాత్రం జిల్లా ఎమ్మెల్యేలతో గ్యాప్ ఉందట. పీసీసీ అధ్యక్షునితోనూ అంటీ ముట్టనట్లుగా ఉంటారట. పొద్దుటూరి సీతయ్యకు ఎమ్మెల్యేలతో గ్యాప్ ఎందుకు.. ఆయన తీరుతో క్యాడర్ లో అసంతృప్తికి కారణాలేంటి..నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్కు పెద్ద దిక్కునని భావిస్తున్నారు. ఇక్కడ మంత్రి పదవి లేకున్నా.. ఆయనే మంత్రికాని మంత్రిలా వ్యవహారాలను నడిపిస్తున్నారట. ప్రభుత్వం సైతం సీనియారిటీని గుర్తించి కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. దాంతో… ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాల అమలు తీరును సమీక్షించే పవర్ వచ్చేసింది. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే.. జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి తొలి ప్రాధాన్యం ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. అలా… అన్ని విధాలా పాజిటివిటీతో ఆయన జిల్లాపై పట్టు సాధించేందుకు కృషి చేస్తున్నా.. లోకల్ ఎమ్మెల్యేలు మాత్రం అంతొద్దమ్మా అన్నట్టు ఉంటున్నారట.
పైకి ఆల్ ఈజ్ వెల్ అనేలా కనిపిస్తున్నా…. ఇంటర్నల్గా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని కాంగ్రెస్ వర్గాలే చెప్పుకుంటున్నాయి. జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో సుదర్శన్రెడ్డికి పొసగడం లేదన్న గుసగుసలు ఉన్నాయి. పైకి ఇద్దరూ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా .. జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలని ఎవరికి వారు ప్రయత్నిస్తుండటం విబేధాలకు కారణమవుతోందంటున్నారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి మహేష్ గౌడ్ కారణమన్న ప్రచారంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. డీసీసీబీ ఛైర్మన్ ఎంపికలోనూ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదట. ఎవరికి వారే తన మనిషికే పదవి దక్కించుకోవాలని పోటీ పడుతున్నట్టు సమాచారం. ఇక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో కూడా సుదర్శన్రెడ్డి అంటీ ముట్టనట్లు ఉంటున్నారట. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే వ్యవహారాలకు తాను దూరంగా ఉంటున్నానని, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్లు కూడా అలాగే ఉండాలని చెబుతుండటం కొందరికి నచ్చడం లేదంటున్నారు. ఆయన తీరు పై ఇటు నియోజకవర్గం కార్యకర్తలు కూడా గుర్రుగా ఉన్నారట. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారంతోకూడా సుదర్శన్రెడ్డికి గ్యాప్ ఉన్నట్టు తెలిసింది.
కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టించడంలో సుదర్శన్ రెడ్డి పాత్ర ఉందని, ఈ కారణంగా పోచారంతో గ్యాప్ పెరిగిందన్న ప్రచారం హస్తం వర్గాల్లో ఉంది. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జీలు సైతం పెద్దాయనతో వేగలేకపోతున్నామంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. ఆర్మూర్ లో బీజేపీ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటం అక్కడి ఇన్ఛార్జ్ వినయ్ కి మింగుడు పడ్డం లేదంటున్నారు. బాల్కొండలో సునీల్ సైతం కొద్ది రోజులుగా సుదర్శన్రెడ్డికి దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలతో పెద్దగా తేడా లేకున్నా.. మాకు మేమే మీకు మీరు అంటుంటారట వాళ్ళిద్దరూ. ఇలా ఎవరికి వారే ఉంటుండటంతో ప్రభుత్వ సలహాదారుకు జిల్లాపై పట్టు దొరకడం లేదట. మంత్రి కాని మంత్రిగా చలామణీ అవుతున్నా ఆశించిన స్దాయిలో నిధులు తేవడంలో విఫలం అవుతున్నారని పార్టీ శ్రేణులు అంసతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ముక్కుసూటితనంతో పాటు రైస్ మిల్లుర్ల సీఎంఆర్ వ్యవహారంలోను కఠినంగా ఉండటం జిల్లా ఎమ్మెల్యేలకు నచ్చడం లేదనే టాక్ నడుస్తోంది. ఈ వైఖరి రాబోయే రోజుల్లో ఎటు దారి తీస్తుందో చూడాలంటున్నారు పార్టీ కార్యకర్తలు.