Reading Time: < 1 minute
Indiramam Houses: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక అప్డేట్..

హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా తేలినవారికి నోటీసులు అందించారు. వీరి నుంచి సోమవారం వరకు అభ్యంతరాలు స్వీకరించారు.

అర్హులైవారికి లాటరీ పద్దతిలో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను ఆన్‌లైన్ ద్వారా వెల్లడించనున్నారు. లబ్దిదారులు ఆన్‌లైన్‌లోకి వెళ్లి తమ వివరాలను చెక్ చేసుకోవచ్చు. అనంతరం ప్రతీ నియోజకవర్గంలో లాటరీ నిర్వహించి ఇళ్లను కేటాయించనున్నారు. అయితే తిరస్కరించబడిన దరఖాస్తుల్లో ఎక్కువమంది నగరంలో స్థిర నివాసం లేనివారు, ఇప్పటికే ఇల్లు లేదా ఫ్లాట్ కలిగినవారు ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఫోర్ వీలర్స్ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నవారిని అనర్హులుగా గుర్తించారు. ఇక క్యాబ్ సర్వీసుల కోసం ఫోర్ వీలర్ ఉపయోగిస్తున్నవారికి అర్హులుగా తేల్చారు. అయితే అనర్హులైనవారి నుంచి స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నామని, ఒకవేళ వారికి అర్హత ఉంటే లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని హౌసింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు.

అయితే ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హత సాధించారా.. లేదా అనేది ఆన్‌లైన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా అప్లికేషన్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు. http://ts.meeseva.telangana.gov.in, http://tghb.cgg.gov.in, http://tghb.telangana.gov.in వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు.