Reading Time: 2 minutes
Asim Munir Iran Visit Trump Hormuz Us Sanctions Offer

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇటీవల టెహ్రాన్‌లో పర్యటించిన మునీర్.. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయితో సమావేశమైన సమయంలో ఈ ప్రతిపాదనలను వెల్లడించినట్లు తెలుస్తోంది. అమెరికా.. హార్ముజ్ జలసంధిపై ఆంక్షలను, ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉందని, అందుకు ప్రతిగా కీలకమైన జలమార్గాన్ని తెరవాలని ఇరాన్‌ను కోరినట్లు సమాచారం.

M

ఈ వివరాలను అరేబియా ఇంగ్లిష్‌కి వెల్లడించిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా లేదా ఇరాన్ మాత్రం ఈ ప్రతిపాదనల వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. అసిమ్ మునీర్, మొహ్సెన్ రెజాయితో జరిగిన భేటీ “స్పష్టంగా, నిర్ణయాత్మకంగా” సాగినట్లు సదరు అధికారి తెలిపారు. టెహ్రాన్‌కు అనుబంధంగా ఉన్న గ్రూపులు దాడులను నిలిపివేయాలని కూడా మునీర్ కోరినట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య జూన్‌లో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంపై మళ్లీ చర్చలు కొనసాగించాలని కూడా మునీర్ ఇరాన్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం అమలు నిలిచిపోవడానికి వాషింగ్టన్, టెహ్రాన్ రెండూ కారణమని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.

మధ్యవర్తిగా పాకిస్థాన్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే అసిమ్ మునీర్ సోమవారం ఇరాన్‌కు వెళ్లారు. ఆయన వెంట పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ కూడా ఉన్నారు. ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడం, శాంతియుత, శాశ్వత, సమగ్ర పరిష్కారాన్ని సాధించేందుకు ప్రయత్నించడంలో భాగంగానే ఈ పర్యటన చేపట్టినట్లు పాకిస్థాన్ ఆర్మీ తెలిపింది. అయితే పాకిస్థాన్ గతంలో మధ్యవర్తిత్వం చేసిన కాల్పుల విరమణ నెల రోజుల్లోనే విఫలమైందని, జూలైలో మరోసారి ఘర్షణలు చెలరేగాయని సమాచారం.

ట్రంప్‌తో మునీర్ ఫోన్‌లో చర్చ?

సీఎన్‌ఎన్ కథనం ప్రకారం.. ఇరాన్ పర్యటనకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అసిమ్ మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్‌కు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. టెహ్రాన్ పర్యటనలో మునీర్.. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్‌తో కూడా సమావేశమయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలపై చర్చించారు.

మునీర్‌తో సమావేశం అనంతరం ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబాఫ్ మాట్లాడుతూ.. జూన్‌లో కుదిరిన అవగాహన ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరాన్ ఇప్పటికీ కట్టుబడి ఉందని చెప్పారు. అయితే అమెరికా తన హామీలను ఉల్లంఘించడం వల్లే ఒప్పందం అమలులో జాప్యం ఏర్పడిందని ఆరోపించారు. ఒప్పందంలోని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయని.. అమెరికా తన హామీలను ఉల్లంఘించడం వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతిన్నదని, ఆ దేశంపై ఇరాన్‌లో మరింత అనుమానం పెరిగిందని ఘాలిబాఫ్ పేర్కొన్నారు. ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఇరాన్ ప్రయత్నాలను కొనసాగిస్తుందని, అమెరికా తన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం హార్ముజ్ జలసంధి అమెరికా-ఇరాన్ మధ్య ప్రతిష్టంభనకు కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో మునీర్ తాజా పర్యటన, ట్రంప్ తరఫున చేసినట్లు చెబుతున్న ప్రతిపాదనలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనలకు సంబంధించి వాషింగ్టన్, టెహ్రాన్ నుంచి ఇప్పటివరకు స్వతంత్ర అధికారిక ధృవీకరణ రాలేదు.