
ఉత్తర్ ప్రదేశ్లోని సోన్భద్ర ప్రాంతంలో చోటుచేసుకున్న ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సోన్భద్ర జిల్లా రాబర్ట్స్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సునీల్ అనే వ్యక్తికి రోజూ సాయంత్రం వేళల్లో మద్యం తాగే అలవాటు ఉంది. మద్యం సేవించిన తర్వాత నడిచి లేదా వేరే వాహనంలో ఇంటికి వెళ్లడం ఆయనకు విసుగ్గా అనిపించింది. దీనితో ఒక వినూత్న ఆలోచన చేశాడు. వెంటనే తన మొబైల్ నుంచి పోలీసుల అత్యవసర సహాయక నంబర్ 112కి డయల్ చేయడం మొదలుపెట్టాడు.
కాల్ చేసిన తర్వాత తాను ఎక్కడున్నాడో ఆ లొకేషన్ పోలీసులకు చెప్తాడు. అత్యవసర పిలుపు రావడంతో 112 ఎమర్జెన్సీ పెట్రోలింగ్ వాహనం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. అక్కడికి వచ్చాక విషయం అర్థమైనప్పటికీ, పోలీసులు బాధ్యతాయుతంగా అతనికి ఎలాంటి ప్రమాదం జరగకుండా భద్రంగా ఇంటి దగ్గర దించి వస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఈ నాటకం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ వార్త, దానికి సంబంధించిన కథనాలు సోషల్ మీడియాలోకి రావడమే ఆలస్యం, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
రియల్ విఐపి ట్రీట్మెంట్..అంటూ చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ క్యాబ్ బుక్ చేసుకోవడం కంటే ఇది చవకైన ప్లాన్. ప్రభుత్వమే స్వయంగా ఇంటికి దింపే విఐపి సేవలు పొందుతున్నాడు అని కామెంట్ చేశారు. సూపర్ కంప్యూటర్ బ్రెయిన్ అని కూడా కొందరు కామెంట్ చేశారు. మరొకరు ఓలా, ఉబెర్ క్యాబ్ల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ 112 నంబర్నే ట్యాక్సీ సర్వీస్లా మార్చేశాడు, ఈయన తెలివి వేరే లెవెల్ అంటూ చమత్కరించారు.
వీడియో ఇక్కడ చూడండి..
सोनभद्र में ये शराबी चाचा रोज शराब पीकर 112 डायल करता है और घर जाने के लिए पुलिस की गाड़ी की मदद लेता है pic.twitter.com/Ae4SDW1lXx
— आजाद भारत का आजाद नागरिक (@AnathNagrik) August 23, 2026
సహాయం కోరిన వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడంలో పోలీసులు చూపిస్తున్న ఉదారతకు ఒకవైపు ప్రశంసలు వస్తున్నప్పటికీ, అత్యవసర సేవలను ఇలా దుర్వినియోగం చేయడంపై చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా, ఇలా ఫ్రీగా ఇంటికి వెళ్లేందుకు ఈ షరాబీ చాచా కనిపెట్టిన ఈ కొత్త వినూత్న మార్గం ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది.