Reading Time: 2 minutes
Telangana Foreign Liquor Brands New 121 Brands

Telangana Liquor : రాష్ట్రంలోని మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. త్వరలోనే అంతర్జాతీయ ప్రీమియం మద్యం బ్రాండ్లతో పాటు విదేశీ బీర్లు, లగ్జరీ లిక్కర్ రకాలు తెలంగాణ మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు ప్రధానంగా లోకల్, దేశీయ బ్రాండ్లకే పరిమితమైన తెలంగాణ మద్యం మార్కెట్‌లోకి గ్లోబల్ బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు ఎక్సైజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

18 కంపెనీలు.. 121 కొత్త బ్రాండ్లకు అనుమతి

విదేశీ మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా ఇంటర్నేషనల్ బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TSBCL) చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 18 ప్రముఖ కంపెనీలకు చెందిన 121 మద్యం బ్రాండ్లకు ఎక్సైజ్ శాఖ అనుమతులు మంజూరు చేసింది. దీనికి సంబంధించి పబ్లిక్ నోటీస్ జారీ చేసిన ప్రభుత్వం, సెప్టెంబర్ 1 నాటికి అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది. నూతనంగా రానున్న బ్రాండ్లలో అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న సింగిల్ మాల్ట్ విస్కీలు, హెండ్రిక్స్ జిన్, మంకీ షోల్డర్, టైగర్ లాగర్ బీర్లతో పాటు కొరియన్, జర్మన్ బ్రాండ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు దేశీయ ప్రీమియం కేటగిరీకి చెందిన ఆర్థోస్ కలెక్టివ్ మాల్ట్ విస్కీ, శంకర్ డిస్టిలర్స్ వర్చాస్ అమెరికన్ విస్కీ, స్మోక్ ల్యాబ్ వోడ్కా, రీకో, వల్లోన్ వంటి బ్రాండ్లు కూడా త్వరలోనే షాపులు, పబ్బుల్లో లభించనున్నాయి.

మరోవైపు కిక్కు దింపే వార్త.. పెరగనున్న మద్యం ధరలు?

ఒకవైపు కొత్త బ్రాండ్లు వస్తున్నాయన్న ఆనందం ఉన్నప్పటికీ, మరోవైపు మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది. మద్యం తయారీ వెచ్చించే ఖర్చులు, అంతర్జాతీయంగా పెరిగిన ముడిసరుకుల ధరల దృష్ట్యా ధరలు పెంచాలని డిస్టిలరీలు ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ మద్యం తయారీ కంపెనీల ప్రతిపాదనలను పరిశీలించి, ధరల పెంపుపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక దఫా ధరలు పెంచిన నేపథ్యంలో, మళ్ళీ పెంచితే వినియోగదారుల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎలా అధిగమించాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయినప్పటికీ, కంపెనీల ఒత్తిడి మేరకు రానున్న రోజుల్లో మద్యం ధరల పెంపుపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.