
శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ 503/9 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేయగా.. మూడో రోజులో రెండో సెషన్లో శ్రీలంక 181/7 స్కోరుతో నిలిచింది. లంక ఇంకా 322 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మూడు కీలక వికెట్స్ పడగొట్టి.. లంకను ఒత్తిడిలో పడేశాడు. ఈరోజు మీడియాతో ప్రసిద్ధ్ మాట్లాదుతూ తన ప్రణాళికలను వెల్లడించాడు. ఈ క్రమంలో పిచ్, స్లిప్ క్యాచింగ్, తన బౌలింగ్ విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తే సరిపోదని, స్లిప్ ఫీల్డర్లు క్యాచ్ అందుకోవడం మరింత ముఖ్యం అని పేర్కొన్నాడు.
‘శ్రీలంక ఓపెనర్ లాహిరు ఉదారాను ఔట్ చేసిన సమయంలో బంతి పిచ్పై కొద్దిగా ఆగి, స్వల్పంగా సీమ్ అయింది. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుంది. యశస్వి జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ప్రాక్టీస్లో ఫీల్డింగ్పై టీమ్ ఎంతో శ్రమిస్తోంది. అందుకు తగిన ఫలితం ఈ క్యాచ్ రూపంలో వచ్చింది. బౌలర్ ఎడ్జ్ అయ్యేలా బంతిని సరైన ప్రదేశంలో వేయడం ఎంత ముఖ్యమో.. వచ్చిన అవకాశాన్ని స్లిప్ ఫీల్డర్లు క్యాచ్ అందుకోవడం కూడా అంతే ముఖ్యం. జట్టు ఈ విషయంలో బాగా శ్రమిస్తోంది. మ్యాచ్లో పెద్ద విషయాల కంటే చిన్న చిన్న అంశాలను సరిగ్గా చేయడమే విజయానికి దోహదపడుతుంది’ అని ప్రసిద్ధ్ చెప్పుకొచ్చాడు.
‘నా బౌలింగ్లో దూకుడుకు ప్రాధాన్యం ఇస్తా. అయితే బౌలర్ దూకుడు అనేది మాటలు లేదా శరీర భాషలోనే కనిపించాల్సిన అవసరం లేదు. నేను బంతులు వేసే విధానంలో అది కనిపిస్తుంది. పిచ్పై ఏమాత్రం స్పందన లేకపోయినా బౌలర్ దృష్టి మాత్రం మారకూడదు. ఎక్కడ బంతి వేయాలనుకుంటున్నాడనే దానిపైనే దృష్టి ఉండాలి. పూర్తి శ్రమతో అనుకున్న ప్రాంతాల్లో బౌలింగ్ చేయడమే నా లక్ష్యం. నేను ఒకే లెంగ్త్లో బౌలింగ్ చేసే బౌలర్ ని కాదు. పిచ్ స్వభావాన్ని బట్టి బౌలింగ్ లెంగ్త్ను మార్చుకుంటా. ఇందుకోసం విశ్లేషకులు, కోచ్లతో కలిసి చర్చించి.. ఏ లెంగ్త్లో బౌలింగ్ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటా’ అని ప్రసిద్ధ్ వెల్లడించాడు. దేశానికి ఆడక ముందు తనకంటూ ఒక సహజ లెంగ్త్ ఉండేదని.. కానీ అంతర్జాతీయ స్థాయిలో టీమ్కు అవసరమైన ఏ లెంగ్త్లోనైనా బౌలింగ్ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుందని ప్రసిద్ధ్ పేర్కొన్నాడు.