Reading Time: < 1 minute

ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ.. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై వివరణ

Caption of Image.

హైదరాబాద్‌‌, వెలుగు: మంత్రి కొండా సురేఖ ఆదివారం బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. ఇటీవల తన కుమార్తె సుస్మితా పటేల్‌‌ చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలపై ఖర్గేకు ఆమె వివరణ ఇచ్చినట్లు సమాచారం. సుమారు గంటకుపైగా ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల సుస్మితా పటేల్‌‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌‌లో దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై సురేఖను ఖర్గే ఆరా తీసినట్లు సమాచారం.

 పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడటం సరికాదని, నాయకులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన విషయాలను పార్టీ వేదికపైనే చెప్పుకోవాలని ఖర్గే స్పష్టం చేసినట్లు సమాచారం. తన కుమార్తె వ్యాఖ్యలపై ఇప్పటికే రెండుసార్లు వివరణ ఇచ్చానని సురేఖ ఖర్గేకు చెప్పినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌‌ పార్టీని, గాంధీ కుటుంబాన్ని తాను విమర్శించలేదని వివరించినట్లు సమాచారం.

©️ VIL Media Pvt Ltd.