
Arjun Reddy: టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయిన ‘అర్జున్ రెడ్డి’ మరోసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన పదేళ్ల సందర్భంగా, 2027లో థియేటర్లలో 4 గంటల 22 నిమిషాల పూర్తి నిడివి గల ఎక్స్టెండెడ్ వెర్షన్ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్ను పూర్తిగా మార్చేసిన ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు కొత్త రూపం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలై తొమ్మిది ఏళ్లు పూర్తి కావస్తుండగా, 10వ వార్షికోత్సవంలో మరింత కంటెంట్తో కూడిన ఎక్స్టెండెడ్ వెర్షన్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు.
అదే జరిగితే ‘అర్జున్ రెడ్డి’ అభిమానులు మరోసారి పెద్ద తెరపై పండగ చేసుకోబోతున్నట్లే కనిపిస్తోంది. 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’తో సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా పరిచయమయ్యారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో యువతలో భారీ క్రేజ్ను సంపాదించుకుంది. ఈ సినిమా విజయ్ను ఒక్కసారిగా స్టార్ హీరోగా మార్చడమే కాకుండా, సందీప్ రెడ్డి వంగాను కూడా టాలీవుడ్లో ప్రత్యేకమైన దర్శకుడిగా నిలబెట్టింది.
ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఆగిపోకుండా దాని ప్రభావం బాలీవుడ్ వరకు వెళ్లింది. ‘అర్జున్ రెడ్డి’ని సందీప్ రెడ్డి వంగానే హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో తెరకెక్కించారు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఈ రీమేక్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. దీంతో సందీప్, విజయ్ కలయికలో వచ్చిన ఒరిజినల్ సినిమా మరింత పెద్ద స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో పదో వార్షికోత్సవం సందర్భంగా మరోసారి ఆ సినిమాను కొత్త కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల రోమాంచకం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ తాను, విజయ్ దేవరకొండ కలిసి ‘అర్జున్ రెడ్డి’ని రీవర్క్ చేసి ఎక్స్టెండెడ్ వెర్షన్గా విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అంటే థియేటర్లలో ప్రేక్షకులు చూసిన వెర్షన్కు అదనంగా కొన్ని కొత్త సన్నివేశాలను జోడించి సినిమాను మరింత విస్తృతంగా అందించే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం వచ్చిన సినిమాను ఇప్పుడు మరోసారి కొత్త అనుభూతితో చూడటానికి ఇది అభిమానులకు ఆసక్తికరమైన అవకాశంగా మారొచ్చు.
అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే పట్టాలెక్కే పరిస్థితిలో లేదని సందీప్ స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్తగా జోడించే సన్నివేశాలకు విజయ్ దేవరకొండ డబ్బింగ్ చెప్పడానికి కేవలం రెండు మూడు రోజులు సరిపోవచ్చని, కానీ దర్శకుడిగా తాను మాత్రం సినిమాపై పూర్తి స్థాయిలో పని చేయడానికి దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం కేటాయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తనకు ఉన్న వరుస కమిట్మెంట్లు, బిజీ షెడ్యూల్ కారణంగా అంత సమయం కేటాయించడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు.
దీంతో ‘అర్జున్ రెడ్డి’ ఎక్స్టెండెడ్ వెర్షన్ ప్రస్తుతం ప్రణాళిక దశలోనే ఉంది. ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది, ఎలాంటి అదనపు సన్నివేశాలు ఉంటాయి, పదో వార్షికోత్సవం సందర్భంగా నిజంగానే థియేటర్లలో విడుదల చేస్తారా అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ కాంబినేషన్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ వార్త ఇప్పటికే ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక సినిమా ఇద్దరి కెరీర్లను మార్చి పదేళ్లు పూర్తిచేసుకున్న సమయంలో అదే సినిమాను మరింత విస్తరించి తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఆసక్తికరంగానే ఉంది. ఈ ప్రణాళిక కార్యరూపం దాలిస్తే ‘అర్జున్ రెడ్డి’ మరోసారి థియేటర్లలో సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా హై-వోల్టేజ్ పోలీస్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ను రూపొందిస్తున్నారు. ఇది 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీని తర్వాత రణ్బీర్ కపూర్తో భారీ హిట్గా నిలిచిన ‘యానిమల్’ కు సీక్వెల్గా ‘యానిమల్ పార్క్’ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించనున్నారు. ఇవే కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా ఆయన ఒక క్రేజీ పాన్-ఇండియా చిత్రాన్ని ప్రకటించి, రాబోయే నాలుగైదేళ్ల వరకు బిజీ లైనప్ను సిద్ధం చేసుకున్నారు. ఇంత బిజీ లైఫ్ లో కూడా ‘అర్జున్ రెడ్డి’ని మళ్ళీ థియేటర్లలోకి తీసుకురాబోతుండటం విశేషం.