
సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా మరో జడ్జిపైచేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. రాజస్థాన్ తాత్కాలిక న్యాయమూర్తి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఆయనను తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు 2026 ఆగస్టు 26న విజ్ఞప్తి చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ప్రకాశ్ శర్మ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు జస్టిస్ సందీప్ మెహతా ఆరోపించారు. డబ్బున్న పిటిషన్ దారులకు అనుకూలంగా కేసులను తారుమారు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆగస్టు 2, 10, 17 తేదీలకు సంబంధించి మూడు లేఖలలో, జస్టిస్ మెహతా, జస్టిస్ శర్మపై బంధుప్రీతి, పక్షపాతం, అక్రమ పద్ధతులతో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. అంతేకాకుండా, ఆయన రోస్టర్ మాస్టర్గా తన అధికారాలను ఉపయోగించి, కేసులను ఎంపిక చేసుకుని తన సొంత బెంచ్కు తరలిస్తున్నారని కూడా ఆరోపించారు.
జస్టిస్ మెహతా ఆగస్టు 2న రాసిన తన లేఖలో , ఇతర బెంచ్ల ముందు విచారణకు వచ్చిన కేసులను ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా ఉపసంహరించుకుని తన కోర్టుకు జస్టిస్ శర్మ కోర్టుకు బదిలీ చేసిన అనేక ఉదంతాలను తాను గతంలోనే సీజేఐ దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ఇటువంటి కేసుల లిస్టుకు సమర్పించాల్సిందిగా సీజేఐ అడిగినట్లు చెప్పారు. ఆ తర్వాత ఆరోపణలను లిఖితపూర్వకంగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి, తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.
అయితే, దుర్వినియోగానికి పాల్పడిన న్యాయమూర్తిని తొలగించి మరో మరో రాష్ట్రానికి చెందిన ప్రధాన న్యాయమూర్తిని నియమించాలన్న అభ్యర్థనకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదని తెలిపారు.
జస్టిస్ శర్మపై ఇప్పటికే తనకు ఎన్నో ఫిర్యాదులు అందినట్లు ఆయన చెప్పారు. ప్రాథమిక అందిన సమాచారం ప్రకారం ఆయన ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతున్నట్లు తేలిందని అన్నారు. జస్టిస్ శర్మ సెప్టెంబర్ 26న పదవీ విరమణ ఉండటంతో.. అంతలోపే ఎన్నో పిటీషన్లను తారు మారు చేసి పెద్ద స్కాంకు పాల్పడేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు.
జస్టిస్ శర్మ అధికార దుర్వినియోగానికి సంబంధించి ఉదయ్పూర్ భూముల విషయాన్ని ప్రస్తావించారు జస్టిస్ మెహతా. విలువైన భూముల అప్పీళ్లకు సంబంధించిన కేసును మొదట జోధ్పూర్లోని ప్రధాన ధర్మాసనం పరిధిలఓనే విచారించాలని చెప్పి.. తర్వాత జైపూర్లోని తన నేతృత్వంలోని ధర్మాసనానికి జస్టిస్ శర్మ బదిలీ చేశారని ఆయన ఆరోపించారు
ఈ కేసులో ఒక పక్షం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కమలాకర్ శర్మ కోడలిని.. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని జస్టిస్ శర్మ వాదిస్తున్నట్లు ఆరోపించారు. మరో ఆరోపణ ఏంటంటే.. మైనింగ్ దిగ్గజం మేఘరాజ్ సింగ్కు సంబంధించిన క్రిమినల్ కేసు గురించినదిగా పేర్కొన్నారు. ఇలాంటి పలు ఆరోపణలు, ఉదాహరణలతో పేర్కొంటూ.. జస్టిస్ శర్మను తొలగించాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.