Reading Time: < 1 minute
నలుగురి హత్య కేసులో..వంట చేసుకుని తిని, స్నానం చేసిన నిందితులు!

హత్యలకు సంబంధించి రిటైర్డ్ టీచర్  మేనమామ కొడుకులు సిద్ధార్థ దాస్ (19), ముగ్ధ దాస్ (24)ను  అరెస్ట్ చేసినట్లు రంగ్‌పూర్ పోలీస్ కమిషనర్ మొహమ్మద్ అబ్దుల్ మీడియాకు తెలిపారు.

గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రంగ్‌పూర్‌లో ఉన్న చక్రవర్తి కుటుంబానికి చెందిన రెండస్తుల ఇంటి డాబాపైకి ఎక్కి ముగ్ధ, సిద్ధార్థ్ లు యాబా సేవించడానికి ప్రయత్నించారు. పైనుంచి శబ్దాలు వినిపించడంతో గణపతి చక్రవర్తి పైకి వెళ్లారు. ఆ సమయంలో గణపతి చక్రవర్తి మెడలో ఉన్న టవల్‌తోనే ఆయనను గొంతు నులిమి హత్య చేసారు. అలికిడికి ఏం జరుగుతోందో చూసేందుకు వెళ్లిన భార్య ప్రీతిలతను గొంతు నులిమి చంపేసారు.  పైకి  వచ్చిన ఆ దంపతుల కుమార్తెపై కూడా నిందితులు దాడి చేశారు.  ఆమెతో పెనుగులాడిన నిందితులు,  తాడును గొంతుకు బిగించారు. తర్వాత, తమను గుర్తుపడతాడని కుమారుడిని కూడా కడతేర్చారు.

గణపతి చక్రవర్తి, ఆయన భార్య ప్రీతిలత చక్రవర్తి, కూతురు అగామి, కుమారుడు ప్రియం మృతదేహాలు శనివారం వారి ఇంట్లోనే లభ్యమయ్యాయి. నిందితులు వారి ముఖాలను మండే పదార్థంతో కాల్చివేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇంట్లోనే రాత్రి బస

హత్యల అనంతరం ఇద్దరు నిందితులు రాత్రంతా  ఇంట్లోనే గడిపినట్లు పోలీస్ కమిషనర్  తెలిపారు. శుక్రవారం జుమ్మా ప్రార్థనల సమయంలో వీధులు నిర్మానుష్యంగా ఉన్న సమయం చూసి బయటపడ్డారని చెప్పారు. అంతేకాదు నిందితులు ఇంట్లోనే స్నానం చేసి, ఫ్రిజ్‌లోని ఖర్జూరాలు, కీరా ముక్కలు తిన్నారు.

పోలీసులను తప్పుదారి పట్టించేందుకు బీరువాలు తెరిచి బట్టలు, ఇతర వస్తువులను చిందరవందరగా పడేశారు. బంగారు నగలను దోచుకున్నారు.  రెండు మొబైల్ ఫోన్లను సబ్బు నీటిలో ముంచి ధ్వంసం చేశారు. నిందితుల్లో  ఒకడు స్వర్ణకారుడు కావడంతో నిప్పుతో ఒక బంగారు గాజును పరీక్షించే ప్రయత్నం చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.  సిద్ధార్థ చేపల వ్యాపారం చేస్తుండగా, ముగ్ధ  గోల్డ్ స్మిత్ పని చేస్తున్నాడు. అయితే విచారణలో సిద్ధార్థ,  ముగ్ధ తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.  కేసుకు సంబంధించిన మరింత  విచారణ కొనసాగిస్తున్నట్లు అన్నారు.