
గ్రేటర్ సైబరాబాద్ పరిధిలో నార్సింగి లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నార్సింగి సర్కిల్ పరిధిలోని గిరిగిరిగడ్డ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 60 గజాల స్థలంలో G+7, పెంట్ హౌస్. బిల్డింగ్ ను నిర్మించడంతో పాటు, అనుమతులకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. జీ+2 నిర్మాణానికి అనుమతి తీసుకుని జీ+7 వరకు నిర్మించిన భవనాన్ని గ్యాస్ కట్టర్తో అధికారులు తొలగించారు.
అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇతర భవనాలను కూడా గుర్తించి కూల్చివేత చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కూల్చివేసిన భవనాలను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. ఇప్పటివరకు ఏడు బిల్డింగ్లను కూల్చి వేశాం.. రెండు బిల్డింగ్ లను సీజ్ చేశామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు..