
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) మద్యం రవాణా కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసింది. హైదరాబాద్ జోనల్ కార్యాలయానికి చెందిన అధికారులు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 కింద ఆయనను అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. అనంతరం కారుమూరి వెంకట నాగేశ్వరరావును హైదరాబాద్ నాంపల్లిలోని పీఎంఎల్ఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
రూ.195.33 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజిలెన్స్ అదనపు కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఈడీ తెలిపింది. ఈడీ ప్రకారం, ఏపీఎస్బీసీఎల్ మద్యం రవాణా టెండర్ నిబంధనలను ఉద్దేశపూర్వకంగా మార్చి కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించారు. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SSCSPL), అనంతరం ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ సంస్థలకు అనుకూలంగా టెండర్ ప్రక్రియను రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఈడీ పేర్కొంది.
ఈ సంస్థలు కేవలం బినామీ సంస్థలుగా పనిచేశాయని, వాటి అసలు కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దాంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, వారి అనుచరుల నియంత్రణలో ఉన్నాయని ఈడీ ఆరోపించింది. అప్పటి ఏపీఎస్బీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ దాంతిరెడ్డి వాసుదేవ రెడ్డితో కుమ్మక్కై మార్కెట్ ధరల కంటే అధిక ధరలకు టెండర్లు దక్కించుకుని అక్రమ లాభాలు ఆర్జించినట్లు ఈడీ తన ప్రకటనలో పేర్కొంది.
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి సబ్కాంట్రాక్టుల కేటాయింపులపై ప్రభావం చూపినట్లు ఈడీ ఆరోపించింది. శ్రీ సుదర్శన కన్స్ట్రక్షన్స్ పేరుతో డమ్మీ సబ్కాంట్రాక్టర్ సంస్థను ఏర్పాటు చేసి, పెంచిన నకిలీ ఇన్వాయిస్ల ద్వారా కోట్ల రూపాయలను ఆ సంస్థ ఖాతాకు మళ్లించినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపింది. అనంతరం ఆ నిధుల్లో కొంత భాగం కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు బదిలీ అయినట్లు ఈడీ పేర్కొంది. ఇక, అక్రమంగా సమకూరిన నిధులతో లగ్జరీ కార్లు, ఖరీదైన గడియారాలు, స్థిరాస్తుల కొనుగోళ్లకు అడ్వాన్సులు, రాజకీయ ఖర్చులు చేసినట్లు ఈడీ గుర్తించిందని తెలిపింది. అంతేకాకుండా అక్రమంగా వచ్చిన డబ్బును చట్టబద్ధమైన వ్యాపార ఆదాయంగా చూపించే ప్రయత్నం చేసినట్లు కూడా ఈడీ ఆరోపించింది.