Tirumala: ఒకే ట్రైన్లో తిరుపతి, అరుణాచలం వెళ్లి రావొచ్చు. భక్తులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ప్రత్యేక రైలు వచ్చేసింది..

తెలుగు రాష్ట్రాల నుంచి తరచూ వేలాదిమంది తిరుపతి, అరుణాచలం వెళ్తుంటారు. దీంతో ఈ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో రైలును ప్రవేశపెట్టింది. చర్లపల్లి- తిరుచిరాపల్లి మధ్య ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రైలు తిరుపతి, తిరువణ్ణామలై, శ్రీరంగం వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలను నేరుగా కలుపుతుంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుండి ఈ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునేవారు ఇకపై రైళ్లు మారాల్సిన అవసరం లేదు. టెంపుల్ టూరిజంను ప్రోత్సహించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
చర్లపల్లి- తిరుచిరాపల్లి(17077) ప్రతి మంగళవారం సాయంత్రం 5:20 గంటలకు చెర్లపల్లి నుండి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8:50 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం 1:20 గంటలకు తిరువణ్ణామలై, సాయంత్రం 4:30 గంటలకు శ్రీరంగంకు చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 6:45 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. దక్షిణ భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలను ఒకే రైలులో సందర్శించాలనుకునే యాత్రికుల కోసం ప్రత్యేకంగా ఈ సర్వీసును రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్(17078) ప్రతి బుధవారం రాత్రి 9:30 గంటలకు తిరుచిరాపల్లి నుండి బయల్దేరి రాత్రి 9:52 గంటలకు శ్రీరంగం, తెల్లవారుజామున 1:28 గంటలకు తిరువణ్ణామలై, ఉదయం 7:05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అనంతరం రాత్రి 10:20 గంటలకు చెర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ రైలులో 3 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 10 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి. అయితే హైదరాబాద్ నుండి తిరుపతికి ఇప్పటికే అనేక రైళ్లు నడుస్తున్నాయి. కానీ అరుణాచలంకు వెళ్లాలనుకునేవారికి రైళ్లు తక్కువగా ఉన్నాయి. కొత్తగా ప్రారంభించనున్న చెర్లపల్లి–తిరుచిరాపల్లి ప్రత్యేక రైలు, అరుణాచలం, శ్రీరంగం వెళ్లాలనుకునేవారికి ఉపయోగపడనుంది. తిరుపతి, అరుణాచం వెళ్లే భక్తులకు ఈ రైలు వల్ల మరింత ప్రయోజనం కలగనుంది.