Reading Time: 2 minutes
Trump Giorgia Meloni Iran Row Nato Summit Turkey Comments

ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఇటలీ ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందని ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెలోనీ స్పందిస్తూ.. ఇటలీ ఎప్పుడు ఎవరి ముందు తలవంచదని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్-మెలోనీ మధ్య విభేదాలు నడిచాయి.

తాజాగా టర్కీలో ట్రంప్ పర్యటిస్తున్నారు. ఎర్డోగాన్‌తో కలిసి ట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో మెలోనీతో నెలకొన్న విభేదాలను తగ్గించేందుకు ట్రంప్ ప్రయత్నించారు. ‘‘ఆమె అంటే ఇప్పటికీ నాకు ఇష్టం. ఆమె మంచి వ్యక్తి.. కానీ ఒక తప్పు చేసింది.’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఇరాన్ విషయంలో ఆమె మాకు సహకరించడానికి నిరాకరించింది. నేను ఆమెపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. అయినప్పటికీ ఆమె సహాయం చేయలేదు. దీంతో మా సంబంధాల్లో కొంత దూరం ఏర్పడింది. అయినా ఆమె అంటే నాకు ఇష్టం. ఆమె మంచి వ్యక్తి. అయితే ఆ విషయంలో ఆమె తప్పు చేసింది.’’ అని ట్రంప్ అన్నారు.

వివాదం ఎలా మొదలైంది?

గత నెల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా ఓ ఇటాలియన్ జర్నలిస్టుతో మాట్లాడిన ట్రంప్.. ‘‘మెలోనీ తనతో ఫొటో దిగేందుకు బతిమాలింది’’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను జార్జియా మెలోనీ తీవ్రంగా ఖండించారు. ట్రంప్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని, సన్నిహిత మిత్రదేశ నాయకురాలిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మెలోనీ విమర్శించారు. దీంతో ఈ వ్యవహారం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదంగా మారింది. వివాదం మరింత ముదిరేలా ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ‘‘Restraining Order Needed’’ అనే క్యాప్షన్‌తో ఓ ఎడిట్ చేసిన ఫొటోను పోస్టు చేశారు. ఆ ఫొటోలో ట్రంప్ ముందుగా నిలబడి ఉండగా.. మెలోనీ ఆయన వైపు చిరునవ్వుతో చూస్తున్నట్లుగా చూపించారు. దీంతో ఇటలీలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై మరింత స్పందించబోమని ఇటలీ మంత్రులు ప్రకటించారు. అలాగే రోమ్‌లో నిర్వహించాల్సిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యే కార్యక్రమాన్ని కూడా ఇటలీ అధికారులు రద్దు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ఇరాన్‌కు సంబంధించిన వివాదంలో అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడమే తమ మధ్య విభేదాలకు ప్రధాన కారణమని ట్రంప్ తెలిపారు. మెలోనీ తీసుకున్న నిర్ణయం తనను నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ఇదే కాకుండా ఇటీవల ట్రంప్ పోప్ లియోపై చేసిన వ్యాఖ్యలను కూడా మెలోనీ విమర్శించడం ఇరువురి మధ్య విభేదాలను మరింత పెంచింది. ఒకప్పుడు యూరప్‌లో ట్రంప్‌కు అత్యంత సన్నిహిత మిత్రుల్లో జార్జియా మెలోనీ ఒకరిగా భావించబడినా.. విదేశాంగ విధానాలు, బహిరంగ వ్యాఖ్యల కారణంగా ఇటీవల వారి సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే నాటో సదస్సు సందర్భంగా ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇరువురి మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.