Reading Time: 2 minutes
West Bengal Bjp Government Suvendu Adhikari Amit Shah Nirbhay Bengal

Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సర్కార్ ఏర్పడబోతోంది. బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎన్నుకున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో శుక్రవారం కోల్‌కతాలో జరిగిన శానసభ పక్ష సమావేశంలో సీఎం ఎన్నిక జరిగింది. బీజేపీపై విశ్వాసం ఉంచడం ద్వారా ప్రజలు ‘‘నిర్బయ బెంగాల్’’ దిశగా ఒక అడుగు వేశారని షా అన్నారు. బీజేపీ, ప్రధాని మోడీపై విశ్వాసాన్ని ఉంచి బెంగాల్ ప్రజలు భారీ విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు.

కమ్యూనిస్ట్ పాలన నుంచి బెంగాల్‌లో భయం, హింసాత్మక వాతావరణం ఉందని, ఇది ఆ తర్వాత తీవ్రంగా మారిందని అమిత్ షా ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్ ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారని అన్నారు. ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా ‘‘సోనార్ బంగ్లా’’(బంగారు బెంగాల్) లక్ష్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. బెంగాల్ భయం రహిత సమాజం దిశగా వెళ్తుందని అన్నారు.

గత 5 దశాబ్ధాలుగా బెంగాల్ శాంతిభద్రతలు, ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ పరంగా తీవ్రమైన ప్రతికూల రాజకీయాలను చూసిందని.. బెంగాల్ ప్రజలకు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఇప్పుడు బీజేపీ బాధ్యత అని అన్నారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేస్తూ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ అరబిందో, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి వారు కోరుకున్న బెంగాల్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు.

Read Also: Kerala Chief Minister: కేరళ సీఎం ఈయనేనా.?

ఈ విజయం చాలా ముఖ్యమైందని, 1950లో ప్రారంభమైన సైద్ధాంతిక ప్రయాణం నేడు బెంగాల్‌కు చేరుకుందని, శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మస్థలంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుండటం ఒక చారిత్రక ఘట్టమని చెప్పారు. 2014లో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు చేరిందని ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని చెప్పారు. ఈ విజయం కోసం 321 మంది బీజేపీ కార్యకర్తలు తమ ప్రాణాలను కోల్పోయారని, ఈ విజయం సులభంగా రాలేదని అమిత్ షా వెల్లడివంచారు.

త్రిపుర, అస్సాం, బెంగాల్‌లలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడటంతో సరిహద్దు భద్రతను మరింత పెరుగుతుందని, అక్రమ రవాణా, చొరబాట్లను కఠినంగా అణిచివేస్తామని ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా చొరబాటుదారుల్ని గుర్తించి వారిని తరిమివేసి, చొరబాటురహిత దేవంగా మారుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మమతా బెనర్జీని ఆమె సొంత ఇంటిలో భవానీపూర్‌లో ఓడించి శక్తివంతమైన సందేశాన్ని పంపినట్లు అమిత్ షా చెప్పారు. ఈ విజయంతో బీజేపీపై మరింత బాధ్యత పెరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హింస, కక్షపూరిత రాజకీయాలకు తావు ఉండకూడదని కార్యకర్తల్ని కోరారు.