
Ponnam Prabhakar: ఆర్టీసీ సోదరులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజా శ్రేయస్సు దృశ్య ఆర్టీసీ సమ్మె విరమించాలని కోరారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదు.. ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటని.. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు.. అన్ని వెంటనే పరిష్కారం అయ్యే అంశాలని తెలిపారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందన్నారు. వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగామని తెలిపారు. ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దగ్గర చర్చిస్తామన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని చెప్పారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోందన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశామని.. పెండింగ్ డీఏలు లేకుండా క్లియర్ చేశామన్నారు.
READ MORE: 144Hz రిఫ్రెష్ రేట్, 13.2 అంగుళాల డిస్ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!
“2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశాం. రూ.1205 కోట్లు ఉన్న పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం. రూ.690 కోట్లు ఉన్న సీసీఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించాం. ఇవే కాకుండా నెల వారీగా పీఎఫ్, సీసీఎస్కి రూ.75 కోట్లు చెల్లిస్తున్నాం. ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుంది. సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టాం. గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుంచి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అన్ని అంశాలు పరిష్కారం చేస్తాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు వద్దు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా ఆర్టీసీలో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసు. ఆర్టీసీ లో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు మన అక్కా చెల్లెల్లు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారు. ఆర్టీసీ లో నిత్యం ఉపాధి కోసం విద్య, వైద్యం కోసం పోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. సమ్మె వద్దు. మిమ్మల్ని ఎవరు అడ్డుకోరు ప్రజాస్వామ్య పద్ధతిలో మీ నాయకులు నిరసన తెలుసుకోవచ్చు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవచ్చు. కానీ.. పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దు. పేద ప్రజలకు కార్లలో పోయే స్తోమత లేదు. ప్రతి ఒక్క ఆర్టీసీ కుటుంబ సభ్యుడికి విజ్ఞప్తి చేస్తు్న్నా.. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుఫున కొట్లాడి సాధించుకుందాం..” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.