ప్రస్తుత బిజీ జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమే కాదు.. దాన్ని ఎలా తింటున్నామనేది కూడా చాలా ముఖ్యం. చాలామంది సమయాన్ని ఆదా చేసుకోవడానికి భోజనాన్ని నమలకుండా గబగబా మింగేస్తుంటారు. దీనివల్ల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో, భోజనం చేయడానికి సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణక్రియ నోటి నుంచే ప్రారంభం: చాలామంది ఆహారం కడుపులోకి వెళ్లాకే జీర్ణమవుతుందని అనుకుంటారు. కానీ నిజానికి జీర్ణ ప్రక్రియ మనం నమిలేటప్పుడే నోటిలో మొదలవుతుంది. ఆహారాన్ని బాగా నమిలినప్పుడు లాలాజలంలోని ఎంజైములు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేస్తాయి.ఇక దీనివల్ల కడుపుపై భారం తగ్గి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాకాకుండా నేరుగా మింగేస్తే జీర్ణం కావడానికి చాలా సమయం పట్టి, కడుపుపై ఒత్తిడి పెరుగుతుంది.

అతిగా తినడం, బరువు పెరగడం: మనం తిన్న తర్వాత కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. భోజనం వేగంగా తినేవారు ఆ సమయం లోపే అవసరానికి మించి తినేస్తారు. ఇక ఇది క్రమంగా బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆహారం సరిగా నమలకపోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తాయి.
షుగర్ లెవల్స్, అవయవాలపై ఒత్తిడి: ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం వల్ల గ్లూకోజ్ శరీరంలోకి క్రమంగా విడుదలై రక్తంలో షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా ఉంటాయి. ఇక ఇది మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. వేగంగా తింటే ఆహారాన్ని అరిగించడానికి కాలేయం, ప్యాంక్రియాస్, పేగులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది.
ఇక భోజనం చేయడానికి ప్రతిసారీ కనీసం 20 నిమిషాల సమయం కేటాయించడం మంచిది. చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ, ప్రశాంతంగా బాగా నమిలిన తర్వాతే మింగాలి. ఈ సరైన అలవాటు మనల్ని అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
గమనిక: ఈ సమాచారం ఆరోగ్య నిపుణుల సలహాలు మరియు సాధారణ అవగాహన కోసం అందించబడింది. మీకు తీవ్రమైన జీర్ణసంబంధిత సమస్యలు ఉంటే వైద్యాధికారులను సంప్రదించడం శ్రేయస్కరం.
The post భోజనం వేగంగా తినడం ప్రమాదమా? సరైన సమయం, సరైన పద్ధతి ఇదే! appeared first on Manalokam – Latest Telugu News & Updates.