Reading Time: 2 minutes
New Digital Payment Rules From April 1 2026 2fa Mandatory For All Transactions

New Digital Payment Rules: ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో ఆన్‌లైన్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. ముఖ్యంగా సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి రెండు-దశల ప్రమాణీకరణ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు కేవలం OTP ఆధారంగా జరిగే లావాదేవీలు ఇకపై సరిపోవు. వినియోగదారులు కనీసం రెండు వేర్వేరు ధృవీకరణ విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ నిబంధన సెప్టెంబర్ 2025లో ప్రకటించబడగా, బ్యాంకులకు అమలు కోసం ఏప్రిల్ 1, 2026 వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డులపై ఇప్పటికే 2FA అమల్లో ఉండగా, ఇకపై అన్ని రకాల డిజిటల్ లావాదేవీలకు ఇది వర్తించనుంది.

2FAలో ఉపయోగించే ధృవీకరణ పద్ధతులు
డిజిటల్ చెల్లింపుల సమయంలో ఇలా..
* వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (PIN)
* వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ విధానాలు
* బ్యాంకింగ్ యాప్‌లలో రూపొందించే వర్చువల్ టోకెన్లు
* SMS ద్వారా వచ్చే OTP

ఈ విధానాలలో కనీసం రెండు ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయాలి: ఉదాహరణకు.. OTP + PIN… బయోమెట్రిక్ ధృవీకరణ + పరికరం గుర్తింపు.. టోకెన్ + పాస్‌వర్డ్..

లావాదేవీలలో మార్పులు ఎలా ఉంటాయి?
ఉదాహరణకు, మీరు ఒక దుకాణంలో డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే, ముందుగా PIN నమోదు చేయడం మాత్రమే కాకుండా, అదనంగా OTP లేదా మరొక ధృవీకరణ అవసరం అవుతుంది. అలాగే ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో కూడా రెండు-స్థాయి ధృవీకరణ తప్పనిసరి అవుతుంది.

సైబర్ మోసాలకు అడ్డుకట్ట
ఇటీవలి కాలంలో ఫిషింగ్, సిమ్ స్వాపింగ్, OTP మోసాలు విపరీతంగా పెరిగాయి. మోసగాళ్లు వినియోగదారుల OTPలను సేకరించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 2FA అమలు చేయడం ద్వారా అనధికార లావాదేవీలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక, ఈ నిబంధనలు కేవలం దేశీయ లావాదేవీలకే కాకుండా, అంతర్జాతీయ ఆన్‌లైన్ చెల్లింపులకు కూడా వర్తించనున్నాయి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం, అక్టోబర్ 1, 2026 నాటికి అంతర్జాతీయ కార్డ్-నాట్-ప్రెజెంట్ లావాదేవీలకు కూడా ఇదే విధమైన భద్రతా ప్రమాణాలు తప్పనిసరి అవుతాయి.