Reading Time: < 1 minute
Pakistan Vs Bangladesh Odi Controversy Wide Ball Review Sparks Dispute Pcb Complains To Icc

మూడు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఢాకా వేదిక‌గా ఆదివారం పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మూడో వన్డేలో వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి ఓవర్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం, దానిపై బంగ్లాదేశ్ జట్టు తీసుకున్న రివ్యూ కారణంగా రెండు జట్ల మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే ఈ సిరీస్‌లోని రెండో వన్డే మ్యాచ్‌లో పాక్ బ్యాటర్ సల్మాన్ అలీ అఘా రనౌట్ తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.

పాకిస్తాన్ విజ‌యానికి చివ‌రి ఓవ‌ర్‌లో 14 రన్స్ అవసరం అయ్యాయి. ఆ ఓవర్‌ను బంగ్లా స్పిన్నర్ రిషాద్‌ వేశాడు. తొలి రెండు బంతులకు రిషాద్ పరుగులు ఇవ్వలేదు. మూడో బంతికి రెండు రన్స్ వచ్చాయి. నాలుగో బంతికి పరుగేమీ రాలేదు. ఐదో బాల్‌ని రిషాద్ లెగ్ సాధించగా.. బంతిని షాహీన్ ఆఫ్రిది డౌన్ ది లెగ్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. షాట్ క‌న‌క్ట్ కాలేదు. దీంతో ఫీల్డ్ అంపైర్ వైడ్‌గా ప్ర‌క‌టించాడు. వికెట్ కీప‌ర్ లిట్ట‌న్ దాస్ సూచ‌న మేర‌కు బంగ్లా కెప్టెన్ రివ్యూ తీసుకున్నాడు. ఇక్క‌డే వివాదం చోటు చేసుకుంది.

Also Read: Sanju Samson: ఇన్‌స్పిరేషన్ నుంచి ఫేవరెట్ మూవీ వరకు.. సంజు రాపిడ్ ఫైర్ సమాధానాలు ఇవే!

రివ్యూలో బంతి వైడ్ కాదని, సరైన బంతేనని థర్డ్ అంపైర్ తేల్చాడు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ ప్లేయర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బంగ్లా ఆటగాళ్లు మైదానంలోని బిగ్ స్క్రీన్‌పై రీప్లే చూసిన తర్వాతే.. రివ్యూకి వెళ్లారని పాక్ ఆరోపించింది. ఫీల్డ్ అంపైర్ నిర్ణయం అనంతరం 15 సెకన్లలోపే డీఆర్‌ఎస్ కోరాలని, నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా రివ్యూకు అంపైర్ అనుమతించడంపై పాక్ అసహనం వ్యక్తం చేసింది. ఇది మ్యాచ్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ విషయంపై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వివాదంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.