July 11, 2026

Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు

Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
Reading Time: 2 minutes
Rajnath Singh Indian Navy Protects Economic Interests Ins Mahendragiri Operation Urja Suraksha

భారత నౌకాదళం కేవలం యుద్ధాల్లో పోరాడే బలగమే కాదని… దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడే శక్తివంతమైన రక్షకుడిగా కూడా నిలిచిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ మహేంద్రగిరిను భారత నౌకాదళంలో అధికారికంగా ప్రవేశపెట్టిన సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగించారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ సమయంలో ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ ద్వారా రూ.9,000 కోట్లకు పైగా విలువైన కీలక సరుకును తీసుకెళ్తున్న 18 వాణిజ్య నౌకలకు భారత నౌకాదళం సురక్షిత రక్షణ కల్పించిందని తెలిపారు.

‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ విజయవంతం

పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత నౌకాదళం ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ను చేపట్టి కీలక వాణిజ్య నౌకలకు భద్రత కల్పించిందని రాజ్‌నాథ్ సింగ్ గుర్తుచేశారు. ‘‘పశ్చిమాసియా ఘర్షణల సమయంలో రూ.9,000 కోట్లకు పైగా విలువైన సరుకును తీసుకెళ్తున్న 18 వాణిజ్య నౌకలను భారత నౌకాదళం సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో మన నౌకాదళం యుద్ధ బలగమే కాకుండా దేశ ఆర్థిక ప్రయోజనాల సంరక్షకుడిగా కూడా నిలిచింది.’’ అని కొనియాడారు. కొత్తగా నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత్‌కు మరింత వ్యూహాత్మక బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ యుద్ధ నౌక ‘బ్లూ వాటర్ వార్‌షిప్’ కావడంతో తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితం కాకుండా.. సముద్రాల లోతైన ప్రాంతాల్లో కూడా వారాల తరబడి విధులు నిర్వహిస్తూ భారత సముద్ర ప్రయోజనాలను కాపాడగలదని వివరించారు. ‘‘ఇప్పటివరకు భారత్ సముద్రం ద్వారా తన దిశను నిర్ధారించుకుంది. ఇకపై సముద్రం దిశను కూడా భారత్ నిర్ణయించే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటోంది.’’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.

ప్రధాని మోడీ ప్రతిపాదించిన ‘మహా సాగర్’ దృష్టికోణాన్ని ప్రస్తావించిన రాజ్‌నాథ్ సింగ్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ అత్యంత విశ్వసనీయ భద్రతా భాగస్వామిగా ఎదిగిందన్నారు. ‘‘ఈరోజు ప్రపంచం మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతంపైనే దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో భద్రత, అభివృద్ధి అందరికీ అందాలని భారత్ కోరుకుంటోంది. భారత్ ఇప్పుడు ‘నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్’గా, విశ్వసనీయ భాగస్వామిగా ఎదిగింది.’’ అని తెలిపారు. ప్రకృతి విపత్తులు, సముద్ర దోపిడీదారుల నియంత్రణ, యుద్ధ ప్రాంతాల నుంచి భారతీయులతో పాటు విదేశీయుల తరలింపు వంటి అనేక కీలక ఆపరేషన్లలో భారత నౌకాదళం ఎప్పటికప్పుడు ముందుండి సేవలందిస్తోందని కొనియాడారు. మానవతా సహాయం, విపత్తు నిర్వహణ (HADR), యాంటీ పైరసీ ఆపరేషన్లు, అత్యవసర తరలింపుల్లో భారత నౌకాదళం ‘‘ఫస్ట్ రెస్పాండర్’’, ‘‘ప్రిఫర్డ్ సెక్యూరిటీ పార్ట్నర్’’గా తన ప్రతిభను చాటుకుందని చెప్పారు.

సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక ఆయుధాల సమన్వయంతో భారత సాయుధ బలగాలు ఎంతటి సామర్థ్యాన్ని సాధించాయో ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రపంచానికి తెలిసిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ‘‘ఆ ఆపరేషన్‌లో భారత సాయుధ బలగాలు దేశాన్ని రక్షించడమే కాకుండా, అవసరమైతే శత్రువుపై నిర్ణయాత్మక దాడులు చేసి పూర్తిగా నిర్వీర్యం చేసే సామర్థ్యం తమకు ఉందని నిరూపించాయి.’’ అని పేర్కొన్నారు.

ప్రాజెక్ట్-17ఏ కింద నిర్మించిన అత్యాధునిక ఫ్రిగేట్‌లలో చివరిదైన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి నౌకాదళంలో చేరడంతో తూర్పు నౌకాదళ కమాండ్‌కు మరింత వ్యూహాత్మక బలం చేకూరనుంది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్య మార్గాల భద్రత, కీలక జలసంధుల రక్షణ, ప్రపంచ వాణిజ్య రవాణా నిరంతరాయంగా కొనసాగేలా ఈ యుద్ధ నౌక కీలక పాత్ర పోషించనుంది.