July 11, 2026

Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..

Perni Nani: చంద్రబాబుకు రాజకీయ నీతి గురించి మాట్లాడే అర్హత లేదు.. సీఎంపై పేర్ని నాని ఫైర్..
Reading Time: 2 minutes
Perni Nani Slams Chandrababu Naidu Over Political Ethics Social Media Crackdown Allegations

Perni Nani: చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఎథిక్స్ గురించి మాట్లాడటం అత్యంత సిగ్గుచేటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, పదవి నుంచి దింపేసి, టీడీపీని ఆయన దగ్గర నుంచి లాక్కున్న చంద్రబాబు.. ఈరోజు ఏ మొహం పెట్టుకుని ఎన్టీఆర్ విగ్రహాలకు దండలు వేస్తూ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు అసలు క్యారెక్టర్ గానీ, కనీస రాజకీయ సంస్కారం గానీ ఉందా అని నిలదీశారు. ఇటువంటి వ్యక్తి అనుభవం రాష్ట్రంలో ఎవరికి అవసరమని ఆక్షేపించారు. చంద్రబాబు సొంత తమ్ముడే ఆయనను నమ్మక కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాను కట్టడి చేసేందుకు ఏకంగా రూ. 210 కోట్లు ఖర్చు పెడుతోందని పేర్ని నాని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే వారి గొంతు నులిమేందుకు టాస్క్ ఫోర్స్, సబ్ కమిటీల పేరుతో వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చేస్తున్న దోపిడీ, పాపాలు ప్రజలకు కనపడకూడదనే ఈ అణిచివేత అని.. గతంలోనూ అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. రాజధానికి అవసరం లేకపోయినా పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లోని రైతులపై దుర్మార్గం చేస్తున్నారని, ఉండవల్లిలో జనసేనకు చెందిన రైతుల పొలాలను కూడా ధ్వంసం చేశారని ఆరోపించారు. అమరావతి రైతుల కన్నీటి గాథలను, విజయవాడ లాకప్ డెత్ దారుణాన్ని సోషల్ మీడియానే సమాజానికి చూపించిందని.. అందుకే ప్రశ్నించే వారిపై కక్షగట్టారని పేర్కొన్నారు. అక్రమ కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలను ఒక నెల రోజులు జైల్లో ఉంచగలరేమో కానీ, కొత్త చట్టాలు తెచ్చినా తాము భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

గత రెండేళ్లలో ఈ కేబినెట్ ఒక్కటైనా ప్రజాహిత నిర్ణయం తీసుకుందా అని పేర్ని నాని ప్రశ్నించారు. చివరకు ఓటు వేసి గెలిపించిన మంగళగిరి ప్రజలకే లోకేష్ దొరకడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో పే స్లిప్పులతో సహా చూపించే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. ఒకవైపు ఆర్టీసీని అమ్మకానికి పెట్టేందుకు తలుపులు తెరుస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును నమ్మి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే సీఐ నాగరాజుకు పట్టిన గతే పడుతుందని ఇప్పుడు పోలీసులకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు నిరంతరం అబద్ధాలు చెప్తున్నారని, ఆయనకు ఏమైనా మానసిక రుగ్మత ఉందో లేదో వైద్యులకు చూపించుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల చర్చల్లోకి వచ్చిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ జోసెఫ్ రావణ్ వ్యవహారంపై కూడా పేర్ని నాని స్పష్టతనిచ్చారు. రావణ్ అనే వ్యక్తి ఐడియాలజీకి తాము పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. గతంలో రావణ్ అనే వ్యక్తితో వైఎస్ జగన్‌ను దారుణంగా తిట్టించారని గుర్తుచేశారు. ఆ రావణ్ అనే వ్యక్తి కేవలం వైఎస్ జగన్‌ను, పవన్ కళ్యాణ్‌ను మాత్రమే ఎందుకు విమర్శిస్తాడని.. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలను ఎందుకు ఒక్క మాట కూడా అనడో ప్రజలు గమనించాలన్నారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా కుట్రలు జరుగుతున్నాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, చంద్రబాబు తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి అబద్ధాలు ఆడుతున్నారని పేర్ని నాని మండిపడ్డారు.