July 12, 2026

S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..

S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
Reading Time: < 1 minute
Legendary Singer S Janaki Passes Away Telangana Connection

S Janaki: లెజెండరీ సింగర్ ఎస్. జానకి కన్నమూశారు. భారత సినీ సంగీత ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన జానకమ్మ, శనివారం మైసూరులో చికిత్స పొందుతూ మరణించారు. 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి దంపతులకు జన్మించిన జానకికి తెలంగాణతో అవినాభావ సంబంధం ఉంది. ఆమె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో కొంత కాలం నివసించారు. వేములవాడతో విడదీయరాని సంబంధం ఏర్పడింది.

జానకి తండ్రి ఉపాధ్యాయుడిగా, ఆయుర్వేద వైద్యుడిగా సేవలందించారు. ఆ సమయంలో ఆయన ఉద్యోగరీత్యా సిరిసిల్లకు రావడంతో తెలంగాణ ప్రాంతంతో కూడా ఆమెకు మంచి సంబంధం ఏర్పడింది. ఒక ఇంటర్వ్యూలో జానకి ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో ఉండేవాళ్లమని, మూడు నాలుగేళ్ల వయసులో ‘‘బాలనాగమ్మ’’ సినిమా చూడటానికి వేములవాడ వెళ్లానని చెప్పారు. రెండెడ్ల బండిలో వేములవాడకు వెళ్లేవారమని చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకున్నారు. తాను పాటలు పాడటాన్ని చూసి, పక్కింటి వాళ్లు తీసుకెళ్లేవారని, పాట పాడమని అడిగేవారని చెప్పారు.

19 ఏళ్ల వయసులో తన మామయ్య సూచన మేరకు చెన్నై చేరుకున్న జానకి, ప్రముఖ ఏవీఎం (AVM) స్టూడియోలో గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ అవకాశమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అనంతరం చెన్నైని కేంద్రంగా చేసుకుని వేలాది పాటలు ఆలపిస్తూ దక్షిణ భారతంతో పాటు దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గాయనిగా ఎదిగారు. 1957లో తమిళ సినిమాతో ప్లేబ్యాక్‌ సింగర్‌గా ఎంట్రీ ఇచ్చిన జానకమ్మ విధియిన్‌ విలయాట్టు సినిమాలో పాట పాడారు. 60 ఏళ్ల కెరీర్‌లో 17 భాషల్లో 48 వేలకు పైగా పాటలు పాడారు.