PM Modi: న్యూజిలాండ్లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!

PM Modi: న్యూజిలాండ్లో పర్యాటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ఆక్లాండ్లో జరిగిన ఒక భారతీయ కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ కమ్యూనిటీ పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలా అన్నారు.. “40 సంవత్సరాల తర్వాత ఈరోజు ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించారు. 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను మీకు అందించడం నాకు లభించిన గొప్ప గౌరవం” ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్పై భావోద్వేగానికి గురయ్యారు. తాను భారత రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని రోజుల్లో, ప్రభుత్వంలో భాగంగా లేని రోజుల్లో, సుమారు 25 నుంచి 30 ఏళ్ల క్రితం నాటి విషయాలను ఈ వేదికపై నుంచి ఆయన గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రధానమంత్రిగా ఇది నా మొదటి పర్యటన కావచ్చు, కానీ 25 – 30 సంవత్సరాల క్రితం, నేను ఏ ప్రభుత్వంలోనూ భాగం కానప్పుడు, రాజకీయాల్లో అంతగా క్రియాశీలకంగా లేనప్పుడు, నాకు న్యూజిలాండ్ను సందర్శించే అవకాశం లభించింది. ఆ సమయంలో, నాకు గిఫ్ట్గా ఒక మఫ్లర్, ఒక టోపీ, ఒక జత చేతి తొడుగులు ఇచ్చారు. ఈ రోజు నేను ఆ రోజు నాకు గిఫ్ట్గా వచ్చిన మఫ్లర్ను ధరించి మీ మధ్యకు వచ్చాను. దీనిని 25 – 30 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్కు చెందిన ఒక స్నేహితుడు నాకు బహుమతిగా ఇచ్చారు. నేను దీనిని సంవత్సరాలుగా వాడుతున్నాను, ఈ రోజు మీ అందరి ప్రేమను నేను ఎలాగైతే వెలకట్టలేనిదిగా భావిస్తానో, అచ్చం దీనిని కూడా అలాగే అమూల్యంగా భావిస్తాను” అని భావోద్వేగానికి గురయ్యారు.
భారత్, న్యూజిలాండ్ల మధ్య ఉన్న దౌత్య, సాంస్కృతిక సంబంధాల గురించి ప్రధాని మాట్లాడుతూ.. “భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న స్నేహ సంబంధం, ఉమ్మడి విలువలు, పరస్పర నిబద్ధతపై ఆధారపడి ఉన్నాయి. న్యూజిలాండ్ సంస్కృతిలోని ‘వాకా’ అనే ఒక అందమైన పదం ఈ సంబంధం సారాంశాన్ని తెలియజేస్తుంది. శతాబ్దాలుగా, ఈ పదం ప్రజలను ఏకం చేసే చిహ్నంగా నిలిచింది. ‘వాకా’ కేవలం ఒక పడవ కాదు. అది ఒక ఉమ్మడి ప్రయాణానికి ప్రతీక. ఈ రోజు, భారత్ – న్యూజిలాండ్ ‘వాకా’ కలిసి ఒక కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి” అని చెప్పారు. “ప్రతి యుగంలో, ప్రతి దశలో భారతదేశం తనను తాను మార్చుకుంది. దీనికి కారణం నేర్చుకోవాలనే మన తపన. భారతదేశం అందరి నుంచీ నేర్చుకుంటుంది; మనకు దేశ జనాభా కాదు, ప్రజా సంక్షేమ స్ఫూర్తియే ముఖ్యం. అందుకే మనం న్యూజిలాండ్ నుంచి కూడా చాలా నేర్చుకున్నాం” అని అన్నారు.
ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “మహిళలకు మొట్టమొదట ఓటు హక్కు కల్పించిన దేశం న్యూజిలాండ్. నేడు న్యూజిలాండ్ సమాజానికి మహిళలు పెద్ద ఎత్తున సేవలందిస్తున్నట్లు మనం చూస్తున్నాం. నేడు భారతదేశం కూడా ‘మహిళా నేతృత్వ అభివృద్ధి’ అనే మంత్రంతో మహిళలకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తోంది. న్యూజిలాండ్లో వీధులు కూడా భారతీయ నగరాలను గౌరవిస్తాయి. ఎక్కడో ఖండాలా, ఎక్కడో బొంబాయి హిల్స్, ఎక్కడో కోరమండల్, కలకత్తా స్ట్రీట్, ఢిల్లీ క్రెసెంట్, అమృత్సర్ స్ట్రీట్… ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. అక్కడ నివసిస్తున్న మీరు కూడా పూర్తిగా ఒక కివీగా మారిపోయారు. నేను ఏ న్యూజిలాండ్ నాయకుడిని కలిసినా, ఆయన మిమ్మల్నందరినీ ప్రశంసిస్తారు. ఆ ప్రశంస మీకే దక్కుతుంది, నేను గర్వంగా తల ఎత్తుకుంటాను” అని అన్నారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్.. ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ బాల్యాన్ని ప్రస్తావిస్తూ “ఆయన (ప్రధాని మోడీ) ఒక సాధారణ నేపథ్యం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. ఆయన లక్షలాది మందిని పేదరికం నుంచి బయటపడేయడంలో సహాయపడ్డారు. ఆయన మన కాలంలోని అత్యంత ముఖ్యమైన నాయకులలో ఒకరు, అలాగే ఆయన న్యూజిలాండ్కు నిజమైన స్నేహితుడు” అని కొనియాడారు.