July 11, 2026

BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?

BCCI: టీమిండియాలో బిగ్ ట్విస్ట్.. ఐదుగురు కోచ్‌లలో ఒకరిపై వేటు.. ఇంతకీ ఎవరా ఒక్కరు?
Reading Time: 2 minutes
Bcci Review Meeting After England Tour Support Staff Changes Gautam Gambhir Shreyas Iyer

BCCI: బ్రిటన్ పర్యటనలో వరల్డ్ ఛాంపియన్ టీమిండియా వరుస పరాజయాలు మూటగట్టుకోవడంతో బీసీసీఐ తీవ్ర ఆగ్రహంతో ఉంది. మొదట ఐర్లాండ్ చేతిలో, ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్‌లో భారత జట్టు ఘోరంగా విఫలం కావడాన్ని బోర్డు పెద్దలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ దారుణ ప్రదర్శనపై ఇంగ్లాండ్ టూర్ ముగిసిన వెంటనే ఒక హై-లెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా సమక్షంలో జరిగే ఈ సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లను మేనేజ్‌మెంట్ నిలదీయనుంది. ప్రపంచ ఛాంపియన్‌ హోదాలో ఉండి కూడా జట్టు ఇలా చేతులెత్తేయడంపై బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే ఈ మీటింగ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా, కోచింగ్ స్టాఫ్‌లో పెద్ద మార్పులకు దారితీయబోతోందని గట్టిగా వినిపిస్తోంది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే ప్రస్తుత సపోర్ట్ స్టాఫ్‌లో ఉన్న ఒక ముఖ్యమైన కోచ్ భారత జట్టును వీడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన టీమిండియాకు గుడ్ బై చెప్పి, ఒక ప్రముఖ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇచ్చిన భారీ ఆఫర్‌తో అక్కడ చేరడానికి సిద్ధమయ్యారట. ప్రస్తుతం భారత జట్టు సపోర్ట్ స్టాఫ్‌లో గౌతమ్ గంభీర్‌తో పాటు మోర్నే మోర్కెల్ (బౌలింగ్ కోచ్), రయాన్ టెన్ డోస్చాట్ (అసిస్టెంట్ కోచ్), సాయిరాజ్ బహుతులే (స్పిన్ కోచ్), సితాంశు కోటక్ (బ్యాటింగ్ కోచ్), టి.దిలీప్ (ఫీల్డింగ్ కోచ్) ఉన్నారు. వీరిలో జట్టును వీడే ఆ ఒక్కరు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిజానికి భారత క్రికెట్ చరిత్రను గమనిస్తే ఇంగ్లాండ్ లేదా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ ఓడిపోయినప్పుడు కోచ్‌ల పదవులు ఊడటం కొత్తేమీ కాదు. గతంలో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత, ధోనీని లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు పంపాలనే నిర్ణయం తీసుకున్న అప్పటి బ్యాటింగ్ కోచ్ సంజయ్ భంగర్‌పై బోర్డు వేటు వేసింది. అలాగే ఇటీవలి 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్‌ను కూడా బోర్డు పక్కనబెట్టింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఇంగ్లాండ్ పర్యటన విఫలమవడంతో సపోర్ట్ స్టాఫ్‌ను బలిపశువును చేయబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లోను, విశ్లేషకుల్లోను ఒకటే పెద్ద ప్రశ్న నడుస్తోంది. ప్రతిసారీ జట్టు ఓడిపోయినప్పుడు రివ్యూ మీటింగుల పేరుతో హడావుడి చేసి, ఆ తర్వాత కేవలం సమస్యను కప్పిపుచ్చుతారా? లేక ఈసారైనా జట్టు ప్రదర్శన మెరుగయ్యేలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా అనేది చూడాలి. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ లోపాలు, గంభీర్ వ్యూహాలు ఎందుకు ఫలించడం లేదనే విషయాలపై సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా గట్టిగానే ప్రశ్నించేలా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే, రాబోయే జింబాబ్వే పర్యటన సమయానికి భారత జట్టు కొత్త సపోర్ట్ స్టాఫ్‌తో బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.