July 12, 2026

OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!

OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
Reading Time: 2 minutes
Off The Record Over Yadagirigutta Temple

యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు ఎందుకు డుమ్మా కొట్టారు? ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు ఎవరూ అటువైపు తొంగి చూడకపోవడానికి కారణాలేంటి? పిలవని పేరంటానికి మేమెందుకని ఎమ్మెల్యేలు, పిలిచినా వెళ్ళకుండా మంత్రులు నిరసన తెలిపారా? అసలు… లెక్క ఎక్కడ తప్పింది? దేవుడి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ఎందుకు దూరంగా ఉన్నారు? లక్ష్మీనారసింహుడు స్వయంభువుగా వెలిసిన దివ్య క్షేత్రం యాదగిరిగుట్ట. అలాంటి యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కానీ… ఆ కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెళ్ళలేదు. జిల్లా ఇన్ఛార్జ్‌ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా గైర్హాజరయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆమెతోపాటు లోకల్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ అటెండ్‌ అయ్యారు. ఇక్కడే రకరకాల కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. ఈ పాలక మండలి ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రభుత్వ పెద్దలు.

తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డ్‌ తరహాలో ఏర్పాటు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్నది ప్లాన్‌. అంత ప్రతిష్టాత్మకంగా భావించి, ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లాతో సంబంధం ఉన్న ముగ్గురు మంత్రులు ఎందుకు అటెండ్‌ అవలేదంటూ రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక్కడ ఇంకో పాయింట్‌ కూడా ఉంది.పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అధికారిక ఆహ్వానం లేదు. కానీ…. ఆహ్వానం ఉన్న మంత్రులు ముగ్గురూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ళ కాలపరిమితి ఉండేలా… జూన్‌ 30న 18మందితో పాలక మండలిని ప్రకటించింది ప్రభుత్వం. ఛైర్మన్, మరో పదిమంది సభ్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త, ఏడుగురు అధికారులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా బోర్డ్‌ ఏర్పాటైంది. అసలు… యాదాద్రికి టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటు చేయడం కోసం ఏడాదిన్నర నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే…. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఎవరికి వారు… తమకు కావాల్సిన వాళ్ళకు ట్రస్ట్ బోర్డులో కీలక పదవులు ఇప్పించుకునేందుకు సీఎం మీద వత్తిడి తెచ్చారట. అందుకే బోర్డ్‌ ప్రకటన ఆలస్యమైందనే అభిప్రాయం ఉంది. ఇక జూన్‌ 28న నల్లగొండలో జరిగిన సీఎం సభ తర్వాత 30న యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిని ప్రకటించారు.

ఆ వెంటనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కారు. ప్రతిష్టాత్మక ఆలయ పాలక మండలి ప్రకటన సమయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులను ఎందుకు సంప్రదించలేదంటూ అసహనం వ్యక్తం చేశారాయన. రాజగోపాల్ రెడ్డి లాగే చాలామంది ఉమ్మడి జిల్లా నేతలు ట్రస్ట్ బోర్డు ప్రకటన తర్వాత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బోర్డ్‌లో ఆలేరు ఎమ్మెల్యేకు స్థానం కల్పించకపోవడంపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం అవుతోందట. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఆసంతృప్తిగా ఉన్నా… దాన్ని బయటికి చెప్పలేని స్థితిలో ఉన్నారట ఆలేరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య. ఆ అసంతృప్తిని లోపల పెట్టుకునే… ఏదో పిలిచారు కాబట్టి కార్యక్రమానికి వెళ్ళారని అంటున్నారు ఆయన సన్నిహితులు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి టీటీడీ తరహాలో పాలకమండలి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించాక.. తమ వారికి చోటు కల్పించాలంటూ… జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు అన్ని ప్రయత్నాలు చేశారట. కానీ… ఆలస్యంగానైనా వచ్చిన ప్రకటనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాధాన్యం దక్కకపోవడంతో సీనియర్ నేతలు అసంతృప్తిగా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టడం వెనక రీజన్‌ ఇదే అయి ఉండవచ్చని అంటున్నారు. మరోవైపు పాలకమండలి ఏర్పాటులో తమ అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వకపోతేపోయారు….. కనీసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అందరికీ ఎందుకు ఆహ్వానాలు పంపలేదంటూ ఎక్కువ మంది అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో… యాదగిరి గుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రకటన విషయంలో సీఎం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు పరిస్థితులు మారాయన్న మాటలు వినిపిస్తున్నాయి.