నువ్వేం తండ్రివయ్యా.. జ్యోతిష్కుడి మాటలు నమ్మి.. కొడుకుని కడతేర్చిన వ్యక్తి.. ఎందుకంటే?

ఆస్తి వివాదాలు, మూఢనమ్మకాలు కలిసి ఓ కన్నతండ్రిని హంతకుడిగా మార్చాయి. కొడుకు వల్ల తన ప్రాణాలకే ముప్పు ఉందన్న జ్యోతిష్కుడి మాటలు నమ్మి, కన్న బిడ్డను అత్యంత దారుణంగా హత్య చేసిన ఉదంతం తమిళనాడులోని తేని జిల్లాలో వెలుగుచూసింది. మూడేళ్ల పాటు మిస్టరీగా ఉన్న ఈ మిస్సింగ్ కేసు.. చివరకు సీబీసీఐడీ విచారణతో ఘోర హత్యగా తేలింది.
వివరాల్లోకి వెళ్తే.. తేని జిల్లా ఎంజీఆర్ నగర్కు చెందిన వేందర్ బాలాకు తన కుమారుడు శ్రీకాంత్తో కొంతకాలంగా ఆస్తి వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే సమయంలో ఓ జ్యోతిష్కుడు వేందర్ బాలాకు.. నీ కుమారుడి వల్ల నీ ప్రాణాలకు ప్రమాదం ఉంది అని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురైన తండ్రి, కొడుకును వదిలించుకోవాలని డిసైడ్ అయ్యాడు. తన స్నేహితుల సాయంతో శ్రీకాంత్ను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ముల్లై పెరియార్ నదిలో పడేసాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు అదే ఇంట్లో, అదే ఊరిలో ఉంటూ మూడేళ్లు గడిపేశాడు.
అయితే కుమారుడు కనిపించకుండా పోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెతికినా ఫలితం లేకపోవడంతో, కొడుకు తిరిగి వస్తాడనే ఆశతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేశారు. ఇక రంగంలోకి దిగిన సీబీసీఐడీ లోతైన దర్యాప్తు చేపట్టడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. అనుమానితుడిగా తండ్రి వేందర్ బాలాను అదుపులోకి తీసుకుని విచారించగా, తనే హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు వేందర్ బాలాను అరెస్ట్ చేయగా, ఈ హత్యలో సహకరించిన మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.