Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ లెబనాన్లో పలు పట్టణాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. దీంతో మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. దక్షిణ లెబనాన్లోని పలు పట్టణాలపై ఇజ్రాయెల్ శనివారం భారీ ఎత్తున వైమానిక, ఫిరంగి దాడులు నిర్వహించింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులు చోటుచేసుకున్నాయి. ఇజ్రాయెల్-లెబనాన్ సరిహద్దు వెంబడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
లెబనాన్ మీడియా కథనాల ప్రకారం.. దిర్ సిర్యాన్, అల్-ఖంతారా పట్టణాలపై ఇజ్రాయెల్ సైన్యం ఫిరంగి దాడులు చేసింది. అనంతరం దక్షిణ లెబనాన్లోని అల్-మన్సౌరీ (Al-Mansouri) పట్టణంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి వైమానిక దాడులు జరిపాయి. ఈ పట్టణంపై ఇది మూడో వైమానిక దాడిగా స్థానిక మీడియా వెల్లడించింది. దక్షిణ లెబనాన్లోని లక్ష్యాలను గురి చేస్తూ ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న సైనిక చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ప్రాంతీయ యుద్ధాన్ని విస్తరించకుండా ఉండేందుకు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ.. సరిహద్దు ప్రాంతాల్లో ఘర్షణలు మాత్రం ఆగడం లేదు.
ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా-ఇరాన్ మధ్య గత నెల కుదిరిన కాల్పుల విరమణ (సీజ్ఫైర్) ఒప్పందం ఇక ముగిసినట్లేనని ప్రకటించారు. అయితే ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ రెండు దేశాలు చర్చలను కొనసాగించేందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇదే సమయంలో సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలను ముందుకు తీసుకెళ్లి ప్రాంతీయ స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.
అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ కూడా అమెరికాకు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా తమపై దాడులను కొనసాగిస్తే ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)ను ఇరాన్ పాటించదని స్పష్టం చేశారు. జూలై 7, 8 తేదీల్లో ఇరాన్ దీవులు, దక్షిణ నగరాలపై అమెరికా దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్కు విరుద్ధమని ఆరోపించారు. అమెరికా తన బాధ్యతలను పూర్తిగా అమలు చేస్తేనే ఇరాన్ కూడా ఒప్పందానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
ఇరాన్ షరతు ఇదే..
ఇజ్రాయెల్ తాజా దాడుల నేపథ్యంలో అమెరికాతో కొనసాగుతున్న చర్చల్లో ఇరాన్ ఒక కీలక షరతును మరోసారి ప్రస్తావించింది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య శాశ్వత కాల్పుల విరమణ అమలులోకి రావడమే అమెరికాతో జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశంగా ఇరాన్ పేర్కొన్నట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో మధ్యప్రాచ్య పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారాయి.
Israeli Warplanes Carry Out Third Airstrike on Al-Mansouri Town in Southern Lebanon
Israeli regime fighter jets bombed the town of Al-Mansouri in southern Lebanon for the third time.
The strikes are part of continued aggression on southern Lebanese areas. pic.twitter.com/2LSgOGktW4— Tasnim News Agency (@Tasnimnews_EN) July 11, 2026