July 11, 2026

Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్‌మెంట్..

Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్‌మెంట్..
Reading Time: 2 minutes
Harry Brook Targets No1 T20 Ranking After England Series Win Over India

Harry Brook: ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అయిన భారత జట్టును టీ20 సిరీస్‌లో మట్టికరిపించిన తర్వాత, ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియాను కిందికి నెట్టి, నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవడమే ఇప్పుడు తమ జట్టు ముందున్న అతిపెద్ద లక్ష్యమని స్పష్టం చేశాడు. బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది. సౌతాంప్టన్‌లో జరగబోయే చివరి మ్యాచ్‌లోనూ గెలిస్తే.. ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్‌ను వెనక్కి నెట్టి ఇంగ్లాండ్ అగ్రస్థానానికి చేరుకుంటుంది.

తమ తదుపరి లక్ష్యంపై డ్రెస్సింగ్ రూమ్‌లో స్పష్టమైన చర్చ నడుస్తోందని హ్యారీ బ్రూక్ అంగీకరించాడు. “మేము తదుపరి మ్యాచ్ గెలిస్తే ప్రపంచ నంబర్ వన్‌గా నిలుస్తామని మాకు తెలుసు. కచ్చితంగా ఆ స్థానాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాం. భారత్ చాలా బలమైన జట్టు. గత రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం వారు అంతటి అత్యుత్తమ ఫామ్‌లో లేకపోయినప్పటికీ.. వారిపై మా ప్లాన్స్‌ను మేము సరిగ్గా అమలు చేయడం సంతోషంగా ఉంది. భారత్‌పై 4-0తో సిరీస్ గెలవడం చాలా ప్రత్యేకం. ఇక ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరితే అది అంతకంటే అద్భుతం. అదే మా ప్రధాన లక్ష్యం. చివరి మ్యాచ్‌లోనూ వారిని ఘనంగా ఓడించడానికి ప్రయత్నిస్తాం” అని బ్రూక్ ధీమా వ్యక్తం చేశాడు.

ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ఫామ్:
హ్యారీ బ్రూక్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక ఇంగ్లాండ్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. వారు ఆడిన గత 22 పూర్తిస్థాయి మ్యాచ్‌ల్లో ఏకంగా 19 మ్యాచ్‌లు గెలవడం విశేషం. ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లోనూ వారు సెమీఫైనల్ చేరారు. తమ జట్టు ఎదుగుదల ఒక్కరోజులో వచ్చింది కాదని, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా త్వరగా మారడమే తమ విజయ రహస్యమని బ్రూక్ చెప్పాడు. వరల్డ్ కప్‌లో వాంఖడే స్టేడియంలో 250 పరుగుల భారీ ఛేజింగ్‌లోనూ తాము కేవలం కొద్ది పరుగుల తేడాతోనే ఓడిపోయామని, జట్టు ప్రయాణం చాలా బాగుందని గుర్తుచేశాడు. ఇక సౌతాంప్టన్‌లో జరగబోయే చివరి టీ20 మ్యాచ్ రోజే ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్‌లో నార్వేతో ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ జట్టు తలపడనుంది. దీనిపై బ్రూక్ స్పందిస్తూ.. “మేము ఇక్కడ క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్ స్థానానికి చేరి, అక్కడ మా ఫుట్‌బాల్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్తే.. అంతకంటే కావాల్సింది ఏముంది? మేము కచ్చితంగా ఆ మ్యాచ్‌ను కూడా ఫాలో అవుతాం” అని సరదాగా వ్యాఖ్యానించాడు.