Reading Time: < 1 minute

ఇరాన్లో భారత విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు,..టెహ్రాన్‌‌‌‌ నుంచి కోమ్‌‌‌‌కు తరలించిన ఎంబసీ

Caption of Image.

 

  • బస్సులు, ఆహారం, వసతి, భద్రత కల్పన

న్యూఢిల్లీ/టెహ్రాన్: అమెరికా–ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్‌‌‌‌లో ఉద్రిక్తతలు పెరగడంతో భారత ఎంబసీ టెహ్రాన్‌‌‌‌లోని మన విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకుంది. చాలా మంది విద్యార్థులను (ముఖ్యంగా మెడికల్ స్టూడెంట్లు) ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి సురక్షితమైన నగరం కోమ్‌‌‌‌కు తరలించారు. ఎంబసీ బస్సులు ఏర్పాటు చేసి, ఆహారం, వసతి అందించింది. మంగళవారం ఉదయం ఈ తరలింపు పూర్తయింది. 200 మందికి పైగా విద్యార్థులు (ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ నుంచి) కోమ్ చేరుకున్నారు.

ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎంఎస్​ఏ), జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (జేకేఎస్​ఏ) ఇది ధృవీకరించాయి. ఎంబసీ తాజా అడ్వైజరీలో ఇరాన్‌‌‌‌లో ఉన్న భారత పౌరులకు పలు సూచనలు ఇచ్చింది. అనవసరంగా బయటకు రావొద్దని, ఎక్కువగా ఇంట్లోనే ఉండాలని, విండోస్ కు దగ్గర నిలబడవద్దని తెలిపింది. బయట జరిగే ప్రదర్శనలు, ఎక్కువ మంది గుమికూడే ప్రాంతాలకు దూరంగా ఉండాలంది.

భద్రతా పరిస్థితులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని చెప్పింది. ఎంబసీ 24×7 హెల్ప్‌‌‌‌లైన్లు అందుబాటులో ఉన్నాయని అవసరం అయితే వెంటనే సంప్రదించాలని సూచించింది. చాలా మంది విద్యార్థులు కోమ్‌‌‌‌లో సురక్షితంగా ఉన్నారని తెలిపింది. ఇరాన్‌‌‌‌లో మొత్తం దాదాపు 9 వేల మంది భారతీయులు (విద్యార్థులు సహా) ఉండగా.. కొందరు ఇంకా టెహ్రాన్‌‌‌‌లోనే ఉన్నారని పేర్కొంది.

ఎయిర్‌‌‌‌స్పేస్ మూసివేతతో ఎవాక్యుయేషన్ ప్లాన్​పై ఇంకా స్పష్టత లేదు. వారి స్థితిగతులపై భారత్​లోని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పరిస్థితిని గమనిస్తున్నామని, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ఎంబసీ ప్రకటించింది. మరోవైపు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పశ్చిమాసియాలో ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేసింది. 

©️ VIL Media Pvt Ltd.