Reading Time: < 1 minute

టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు దాదాపు ఒకేసారి టి-20లకు, టెస్ట్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరు వన్డే ఫార్మాట్‌లో కొనసాగుతున్నారు. 2027లో జరిగే ప్రపంచకప్‌ను అందుకోవాలనేదే వీరిద్దరి ఆకాంక్ష. అయితే బిసిసిఐ మార్గదర్శకాల మేరకు వీరిద్దరు డొమెస్టిక్ క్రికెట్ టోర్నమెంట్‌ అయిన.. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొంటున్నారు. రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున ఆడుతుండగా.. కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక టోర్నమెంట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఇరువురు శతకాలు సాధించారు.

సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన సిక్కిం 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 236 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు కోల్పోయి ముంబై చేధించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ శర్మ 94 బంతుల్లో 155 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు ఆంధ్ర జట్టుతో జరుగున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 298 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఢిల్లీ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (74) అర్థ శతకం సాధించి ఔట్ కాగా.. వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీ 101 బంుల్లో 131 పరుగులు చేశాడు. మరో ఆటగాడు నితీశ్ రాణా 77 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే.. ఢిల్లీ జట్టుకు 90 బంతుల్లో 8 పరుగులు కావాల్సి ఉంది.