
Kuldeep Yadav: శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నుంచి స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను పక్కనబెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. గాల్ టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం వల్లే ఆయనను తుది జట్టు నుంచి తొలగించారని అంతా భావించారు. కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ల ప్రకటనల్లో వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇది అనారోగ్య సమస్యా లేక తొలగింపా అనే దానిపై రచ్చ మొదలైంది. రెండో టెస్టు టాస్ సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ కుల్దీప్కు తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకిందని, అందుకే ఆయన దురదృష్టవశాత్తు తుది జట్టుకు దూరమయ్యాడని వివరించారు. ఆయన స్థానంలో ఇండోర్ ఆఫ్ స్పిన్నర్ సారాంశ జైన్కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. మొదటి టెస్టులో మానవ్ సుతార్, రవీంద్ర జడేజా మెరుగ్గా బౌలింగ్ చేసినప్పటికీ కుల్దీప్ కేవలం ఒకే వికెట్ తీయడంపై విమర్శలు వచ్చాయి. దీంతో లంక జట్టులోని ఎడమచేతి వాటం బ్యాటర్లను అడ్డుకోవడానికే సారాంశ్ను దించారని ప్రచారం జరిగింది.
బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్ మీడియాతో మాట్లాడుతూ కుల్దీప్ నిజంగానే వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారని స్పష్టం చేశారు. గాలే నుంచి బయలుదేరినప్పటి నుంచి ఆయన గొంతు నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. అయితే ఒకవేళ కుల్దీప్ ఫిట్గా ఉంటే కొలంబో టెస్టులో ఆడించేవారా అని ప్రశ్నించగా, “అది అనవసరమైన ప్రశ్న” అని సమాధానమివ్వడం పలు అనుమానాలకు తావిచ్చింది. టాప్ ఆర్డర్లో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున ఆఫ్ స్పిన్నర్ను ఆడించడమే సరైన నిర్ణయమని వ్యాఖ్యానించడం గమనార్హం.
గత 72 గంటల్లో టీమిండియా మేనేజ్మెంట్ నుంచి వచ్చిన ప్రకటనలు తీవ్ర గందరగోళాన్ని సృష్టించాయి. ఆగస్టు 21న కొలంబోలో జరిగిన ప్రాక్టీస్ సెషన్కు కుల్దీప్ దూరమైనప్పుడు, ఆయనకు విశ్రాంతి ఇచ్చామని స్పిన్ కోచ్ బైరాజ్ బహుతులే చెప్పారు. మరోవైపు కొలంబో మ్యాచ్ సందర్భంగా కుల్దీప్ జట్టుతో పాటు ప్రయాణించి డగౌట్లో సర్ఫరాజ్ ఖాన్తో కలిసి మ్యాచ్ చూస్తూ కనిపించారు.
9 ఏళ్ల క్రితం 2017లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు కేవలం 19 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడగలిగారు. వరుసగా మ్యాచ్లు ఆడే అవకాశం లభించకపోవడం ఆయన కెరీర్పై ప్రభావం చూపుతోంది. కొలంబో టెస్టులో సారాంశ జైన్ అరంగేట్రం చేయడంతో కుల్దీప్ భవిష్యత్తు టెస్టు అవకాశాలపై మళ్లీ చర్చ ప్రారంభమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..