Reading Time: < 1 minute
Yashasvi Jaiswal Asitha Fernando Clash India Sri Lanka 2nd Test Colombo

Yashasvi Jaiswal vs Asitha Fernando: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆరంభం అదరగొట్టినా, ముగింపు మాత్రం కాస్త రసాభాసగా మారింది. క్రీజులో ఉన్నంతసేపు బౌలర్లపై విరుచుకుపడిన జైస్వాల్, అవుటైన తర్వాత శ్రీలంక పేసర్ అసిథ ఫెర్నాండోతో గొడవకు దిగడం మైదానంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. జైస్వాల్ మొదటి నుంచే శ్రీలంక బౌలర్లను టార్గెట్ చేస్తూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 53 బంతుల్లో 9 ఫోర్లతో 45 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న జైస్వాల్‌ను అడ్డుకోవడానికి లంక పేసర్ ఫెర్నాండో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. తొలుత తీవ్ర ఒత్తిడికి గురైన ఫెర్నాండో, 17వ ఓవర్ ఆఖరి బంతికి వికెట్ పడగొట్టాడు. రౌండ్ ది వికెట్ నుంచి బంతిని లోపలికి స్వింగ్ చేస్తూ వేయగా, కవర్స్ దిశగా షాట్ ఆడబోయిన జైస్వాల్ ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఈ భారీ వికెట్ పడటంతో ఆనందంతో ఊగిపోయిన ఫెర్నాండో, జైస్వాల్ వైపు చూస్తూ సెండ్ ఆఫ్ ఇస్తున్నట్లు సైగలు చేశాడు. పెవిలియన్ వైపు వెళ్తున్న జైస్వాల్‌ను ఉద్దేశించి ఫెర్నాండో ఏదో అనడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన భారత ఓపెనర్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి బౌలర్ వైపు దూసుకొచ్చాడు. ఇద్దరూ ముఖాముఖి తలపడటమే కాకుండా, జైస్వాల్ తన హెల్మెట్‌తో ఫెర్నాండోను సల్పంగా తాకినట్లు (హెడ్ కాంటాక్ట్) కనిపించింది. వాతావరణం మరింత వేడెక్కడంతో శ్రీలంక ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ పక్కకు లాగి గొడవను సర్దుమొదగించారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆరంభంలో ఓపెనర్లు కుదురుగా ఆడినా, క్రమంగా శ్రీలంక బౌలర్లు మ్యాచ్‌పై పట్టు సాధించారు. కేఎల్ రాహుల్ (18) లహిరు కుమార బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా, కొద్దిసేపటికే జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో తొలి సెషన్ ముగిసే సమయానికి భారత్ 66 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కాస్త కష్టాల్లో పడింది. మంచి ఆరంభాన్ని ఇచ్చినా, కొలంబో పిచ్ నుంచి లభిస్తున్న సహాయాన్ని వాడుకుంటూ శ్రీలంక బౌలర్లు లంచ్ సమయానికి మ్యాచ్‌ను సమం చేయగలిగారు.