Reading Time: < 1 minute
Cm Revanth Reddy Meets Rajnath Singh Seeks Support For Adilabad Airport Expansion And Key Defence Projects

CM Revanth Reddy Meets Rajnath Singh: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను బదిలీ చేసినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి అంశాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ, యుటిలిటీల బదిలీ తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దేశ రక్షణ, సమగ్రతకు సంబంధించిన అంశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రికి తెలిపారు.

ఆదిలాబాద్‌లో భారత వాయుసేనకు సంబంధించిన ఎయిర్‌ పోర్టును భారీ స్థాయిలో విస్తరించే ప్రణాళికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని సీఎం అన్నారు. భారత వాయుసేన టెర్మినల్‌తో పాటు ప్రయాణికుల కోసం పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్న టెర్మినల్ భవనం, కార్గో సదుపాయాలు, ఎంఆర్‌వో (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్) కేంద్రాలు, హ్యాంగర్‌ల ఏర్పాటు వంటి అంశాలకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు.

ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత విమానయాన సంస్థలు తమ హ్యాంగర్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెంపునకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డీఆర్‌డీవో/డీఆర్‌డీఎల్ ఎంపిక చేసిన ప్రదేశంలో చేపట్టనున్న కీలక రక్షణ ప్రాజెక్టుకు త్వరితగతిన ఆమోదం ఇవ్వాలని కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్టు దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.