Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Shatters Records With 94 Off 29 Balls Dismisses Odi Format Rumours

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మరోసారి తన ధనాధన్ బ్యాటింగ్‌ విన్యాసంతో వార్తల్లో నిలిచాడు. దంబుల్లాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో శ్రీలంక A పై కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేసి భారత్ A విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతని మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్ A 378 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. శ్రీలంక A లక్ష్యానికి 66 పరుగుల దూరంలోనే నిలిచిపోయింది.

ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అయితే అవార్డు తర్వాత జరిగిన ఇంటర్వ్యూ సంభాషణలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీ20 క్రికెట్‌లో నీవు అద్భుతంగా ఆడుతున్నావు.. కానీ, వన్డేలు ఎక్కువగా ఆడలేదు. ఈ టోర్నమెంట్ నుంచి ఏమి నేర్చుకున్నావు? అని ప్రెజెంటర్ ప్రశ్నించగా.. వైభవ్ ఆ వ్యాఖ్యను పూర్తిగా ఖండించాడు.

ప్రెజెంటర్ అడిగిన ప్రశాంకు వైభవ్ సమాధానమిస్తూ.. నేను వన్డే ఫార్మాట్‌లో కూడా చాలానే మ్యాచ్‌లు ఆడాను. అది చాలామందికి తెలియకపోవచ్చు. వన్డేలు ఆడలేదనేది కేవలం ఒక పుకారు మాత్రమే అంటూ కొట్టి పడేశాడు. ఇంకా దంబుల్లా పిచ్, అక్కడి పరిస్థితులు తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చాయని.. ఆ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం ఎంతో ఆనందంగా అనిపించిందని తెలిపాడు.

ట్రై సిరీస్‌లో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో వైభవ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 4 మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 117 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేదు. అంతేకాదు కేవలం 3 సిక్సర్లు మాత్రమే బాదాడు. కానీ ఫైనల్ లో మాత్రం తన ఆట తీరు పూర్తిగా మార్చుకుని ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. శ్రీలంక Aపై 29 బంతుల్లో 94 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్-A క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఈ ఫైనల్ ఇన్నింగ్స్‌తో ట్రై సిరీస్‌ను వైభవ్ మొత్తం 211 పరుగులతో ముగించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 211 పరుగులు చేయడంతో పాటు మొత్తం 11 సిక్సర్లు బాదాడు.