Reading Time: < 1 minute

విశాఖపట్నం: శ్రీలంక మహిళలతో మంగళవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 20 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు భారత్ 11.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగుర వేసింది.

ఓపెనర్ షఫాలీ వర్మ మెరుగు ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయలో కీలక పాత్ర పోషించింది. చెలరేగి ఆడిన షఫాలీ 34 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. మరో ఓపెనర్ స్మృతి మంధాన (14) పరుగులు చేసింది. వన్‌డౌన్‌లో వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 26 పరుగులు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (10) పరుగులు చేసి వెనుదిరిగింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లంకను భారత బౌలర్లు తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. కెప్టెన్ ఆటపట్టు (31), హసిని పెరిరా (22), హర్షిత (33) పరుగులు సాధించారు. ఆతిథ్య టీమ్ బౌలర్లలో శ్రీచరణి, స్నేహ్ రాణా పొదుపుగా బౌలింగ్ చేశారు.