Reading Time: < 1 minute
Sonia Gandhi And Rahul Gandhi Get Relief In The National Herald Case

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి భారీ ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఈడీ ఛార్జిషీటును న్యాయస్థానం కొట్టేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటు కొనసాగించదగినది కాదని పేర్కొంది. ఈ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరిగిందని అభిప్రాయపడింది. దీంతో ఛార్జిషీటును కొట్టేయడంతో కాంగ్రెస్ అగ్ర నాయకులకు భారీ ఉపశమనం లభించింది.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్, సునీల్ భండారీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నిందితులుగా చేర్చింది. అయితే ఈడీ చర్యను ప్రతీకార చర్యగా కాంగ్రెస్ వాదించింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గోగ్నే మాట్లాడుతూ.. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఫిర్యాదును కొనసాగించలేమని.. ఈ కేసు ఒక ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ఉందని.. ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) ఆధారంగా లేదని పేర్కొన్నారు. ఈడీ ఛార్జ్‌షీట్‌ ఆధారంగా తీర్పు ఇవ్వడం తొందరపాటు చర్యే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.