
చదువులు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన పథకం(PM-VBRY) కింద కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి కేంద్రం రూ.15 వేల ఆర్ధిక సాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. జూన్ 19వ తేదీన ఈ స్కీమ్కు సంబంధించిన నిధులను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి కేంద్రం విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ స్వయంగా ఈ డబ్బులను తన చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. 19వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ బటన్ నొక్కి విడుదల చేయనున్నారని పీఎంఓ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తొలిసారి ఉద్యోగం చేరి పీఎఫ్ అకౌంట్ కలిగి ఉన్నవారికి ఈ నిధులను రెండు విడతలుగా అందిస్తున్నారు. ఇక ఉద్యోగులతో పాటు ఉద్యోగ కల్పించిన కంపెనీకి కూడా ఒక్కొ ఉద్యోగి తరపున రూ.3 వేల ప్రోత్సాహకం విడుదల చేయనున్నారు.
రెండు విడతలుగా ఖాతాల్లోకి సొమ్ము
ఉద్యోగికి రూ.15 వేలను రెండు విడతలుగా నేరుగా అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఇప్పుడు తొలి విడత కింద రూ.2,400 కోట్లను మోదీ విడుదల చేయనున్నారు. దేశంలో ఉద్యోగాలను సృష్టించడం, ఉద్యోగాలు కల్పించే కంపెనీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఆగస్ట్ 1,2025న వీబఆర్వై స్కీమ్ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. జులై 31,2027 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని తెలిపింది. ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలో ఉద్యోగికి రెండో విడతల్లో రూ.15 వేలు ఇస్తుండగా.. యజమానికి రెండేళ్లలో నిధులు విడుదల చేస్తోంది. ఈ స్కీమ్ కోసం కేంద్రం బడ్జెట్లో రూ.99,446 కోట్లు ప్రకటించింది. ఉపాధిని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం, అన్ని రంగాల్లో సామాజిక భద్రతా పరిధిని విస్తరించడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను ప్రారంభించారు. ఇప్పటివరకు ఈ స్కీమ్ ద్వారా 15 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని కేంద్రం చెబుతోంది. ఉద్యోగులతో పాటు యజమానులకు కూడా ప్రోత్సాహకాలు అందించడం వల్ల ఉపాధిని విస్తరించినట్లు అవుతుందని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఇది సహాయపడుతుంది.
PM-VBRY పథకానికి దరఖాస్తు చేసుకోవాలా..?
PM-VBRY పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలా? అంటే అవసరం లేదనే చెప్పాలి. మీరు ఉద్యోగం చేరాక కంపెనీ పీఎఫ్ అకౌంట్ అందిస్తుంది. దానిని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పథకానికి అర్హులు అవుతారు. ఈపీఎఫ్వో ఆధ్వర్యంలో ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మీరు కొత్త పీఎఫ్ అకౌంట్ తీసుకోగానే దాని వివరాల ఆధారంగా మీ అకౌంట్లో నగదు జమ అవుతాయి. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.