Reading Time: 2 minutes
Vaibhav Sooryavanshi Sledging Mental Toughness Sports Psychologist Warning

Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్‌గా మారిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి రానున్న రోజుల్లో ‘స్లెడ్జింగ్’ (మైదానంలో స్లెడ్జింగ్ చేయడం ద్వారా ఏకాగ్రతను దెబ్బతీయడం) పెద్ద సవాలుగా మారనుందని క్రీడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా ‘ఎ’ మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాళ్ల స్లెడ్జింగ్‌కు వైభవ్ తీవ్రంగా స్పందించి, సహనం కోల్పోయిన సంఘటనను గుర్తు చేస్తూ.. అతనికి తక్షణమే “సిట్యుయేషన్ మేనేజ్‌మెంట్” (పరిస్థితులను హ్యాండిల్ చేయడం) పై శిక్షణ అవసరమని స్పష్టం చేస్తున్నారు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి, ఏకంగా 237.31 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్.. అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, అతని ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రత్యర్థి జట్లు మానసికంగా దెబ్బతీసే వ్యూహాలను (స్లెడ్జింగ్) అస్త్రాలుగా వాడుతాయని ప్రముఖ స్పోర్ట్స్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వరూప్ సవనూర్ అభిప్రాయపడ్డారు.

“నేను రెండేళ్ల క్రితం నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో వైభవ్‌తో కలిసి పనిచేశాను. అతను నిజానికి చాలా ప్రశాంతమైన కుర్రాడు. బీసీసీఐ, వివిఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ఇప్పటికే ఇలాంటి యువ ఆటగాళ్ల సైకాలజీ ప్రొఫైలింగ్‌ను క్యాంపుల్లో క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నాయి.” అని స్పోర్ట్స్ సైకాలజిస్ట్, డాక్టర్ స్వరూప్ సవనూర్ తెలిపారు. అయితే, అండర్-19 స్థాయిలో అద్భుతంగా రాణించే ఎంతోమంది ఆటగాళ్లు సీనియర్ స్థాయికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతున్నారనే దానిపై సవనూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిభ, టెక్నిక్, పట్టుదల అన్నీ ఉన్నప్పటికీ.. సిట్యుయేషనల్ ఇంటెలిజెన్స్ లోపించడం వల్లే చాలామంది కెరీర్‌లో వెనుకబడిపోతున్నారని, కేవలం ఆటలోనే కాదు, ఒత్తిడిని జయించడంలోనూ మైండ్ కంట్రోల్ ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.

సీనియర్ల రిటైర్మెంట్.. కుర్రాళ్లపై ఒత్తిడి!

ప్రస్తుతం టీమిండియా పరివర్తన దశలో ఉంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి దిగ్గజాలు వీడ్కోలు పలకడంతో.. వారి స్థానాలను భర్తీ చేసేందుకు యువ ఆటగాళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా రికార్డులు సాధించాలనే తొందరపాటు వారిలో ఆందోళనను (Anxiety) పెంచుతుందని ఓ మాజీ జాతీయ సెలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ యువ ఆటగాళ్లకు అండగా ఉంటూ.. “మేము మీ వెనుక ఉన్నాం, తొందరపడకండి” అనే భరోసా ఇవ్వాలని సూచించారు. స్పోర్ట్స్ ఎకోసిస్టమ్‌లో ఒత్తిడి, ఆందోళనలను ఒక పెద్ద సమస్యగా కాకుండా, ఆటలో భాగంగా చూస్తూ వాటిని ఎదుర్కొనేలా మానసిక సన్నద్ధతను ఒక దినచర్యగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.