
చిట్ ఫండ్ పేరుతో భారీ మోసానిక తెగబడ్డారు. మీర్పేట్లో రూ.2 కోట్ల స్కాం వెలుగులోకి వచ్చింది. వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్యలు నడిపిన ‘వెంకట సాయి చిట్ ఫండ్స్’ పేరుతో గత పదేళ్లుగా ప్రజల నుంచి భారీగా డబ్బు సేకరించి మోసం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. గత 10 సంవత్సరాలుగా వైష్ణవి కాలనీలో చిట్టీలు నిర్వహిస్తూ స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజల నుంచి భారీ మొత్తాల్లో పెట్టుబడులు సేకరించినట్లు తెలుస్తోంది.
ఒక్కొక్కరు 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు డబ్బు ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. 25 మందికి పైగా బాధితులు ఈ మోసానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. చిట్ గడువు ముగిసినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా నిర్వాహకులు కాలయాపన చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. డబ్బు అడిగితే చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి తప్పించుకోవడం, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై బాధితులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైష్ణవి కాలనీవాసులు సురేష్ కుమార్ దంపతులపై తక్షణం చర్యలు తీసుకొని, తమ డబ్బులు వెనక్కి వసూలు చేయాలని, న్యాయం చేయాలని పోలీసులను కోరారు.