Reading Time: < 1 minute
Samantha Naga Chaitanya Attend Simran Narang Wedding Reception Hyderabad

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ రిసెప్షన్ శనివారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నాగార్జున, రవితేజ వంటి సినీ దిగ్గజాలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఈ వేడుకలో అందరి కళ్ళు నాగచైతన్య సమంతలపైనే నిలిచాయి. విడాకుల తర్వాత వీరిద్దరూ కలిసి ఏ సినిమా ఈవెంట్‌లో కానీ, కుటుంబ వేడుకలో కానీ పాల్గొనలేదు. కానీ ఈ రిసెప్షన్‌లో ఇద్దరూ తమ భాగస్వాములతో కలిసి కనిపించడం విశేషం.

నాగచైతన్య తన భార్య శోభిత ధూళిపాళ, తల్లిదండ్రులు నాగార్జున-అమలతో కలిసి ఈ వేడుకకు విచ్చేశారు. ఆ కొద్దిసేపటికే సమంత కూడా తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి రిసెప్షన్‌కు రావడంతో మీడియా కెమెరాలన్నీ అటే మళ్లాయి. వివాదాలు, విడాకుల తర్వాత ఇద్దరూ రెండో పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమ బంధానికి గుర్తుగా వేయించుకున్న టాటూలను తొలగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, సమంత తన మెడపై ఉన్న ‘YMC’ (ఏమాయ చేశావే) టాటూను మాత్రం అలాగే ఉంచుకోవడం గమనార్హం.

తమ కెరీర్‌కు, ప్రేమ బంధానికి పునాది వేసిన ‘ఏమాయ చేశావే’ సినిమాపై గౌరవంతోనే సమంత ఆ టాటూను ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో గొడవల తర్వాత విడిపోయి, ప్రస్తుతం వేర్వేరు జీవితాల్లో స్థిరపడిన ఈ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.