Reading Time: < 1 minute
Andhra Pradesh Government Employee Promotions Fast Track Deadline

AP Govt Employee Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి ప్రమోషన్లతో పాటు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను రేపటి లోపే పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది. ముఖ్యంగా కమర్షియల్ టాక్స్ శాఖతో పాటు అన్ని హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (HODs)లో గెజిటెడ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి సారించింది. లోకల్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కొత్త ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్ చట్టం అమల్లోకి రాకముందే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో భవిష్యత్తులో సీనియారిటీకి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్‌ను చేపట్టిన ప్రభుత్వం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులో ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. పనితనాన్ని మెరుగు పరిచేలా చేస్తాయి. ఈ విషయంలో వారికి ఎలాంటి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ-డీపీసీ విధానం అమల్లోకి తెచ్చింది. పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు మరింత పారదర్శకం చేసింది. ఈ -డీపీసీ వల్ల ఏప్రిల్‌, ఆగస్టులో పదోన్నతులు రావాల్సిన వారికి ముందుగానే నవంబరు, డిసెంబరులో వచ్చాయి. కానీ, అన్ని స్థాయిలలో, అన్ని శాఖల్లో ఇది జరగడం లేదు. సచివాలయంలోని ఆర్థిక శాఖ, దాని పరిధిలోని హెచ్‌వోడీలు, అసెంబ్లీలో రెండేళ్ల నుంచి పదోన్నతులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వంలో పదోన్నతులు పెండింగ్‌లేని శాఖ ఒక్కటి కూడా లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది.