Reading Time: 2 minutes
AP 10th Class 2026 Result Date: విద్యార్ధులకు అలర్ట్.. పదో తరగతి ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే

అమరావతి, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ఏప్రిల్ 3తో ముగిసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 3,415 కేంద్రాలలో ఈ పరీక్షలు జరిగాయి. ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 6వ తేదీ నుంచే మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లాల్లో మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 15తో ముగిసింది. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే మార్కులను మాన్యువుల్‌తో పాటు ట్యాబ్‌ల్లోనూ నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్కుల లెక్కింపులో పొరపాటు లేకుండా ఉండేందుకు ఈ ఏడాది ట్యాబ్‌లను తీసుకొచ్చారు. మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబుల్లో నమోదు చేసి పొరబాట్లకు తావులేకుండా ఖచ్చితత్వం పాటించాలని సూచించింది. మార్కుల ఎంట్రీ కోసం ఈ ఏడాది కొత్తగా తీసుకువచ్చిన ఈ ట్యాబ్స్‌ విధానం వల్ల మూల్యాంకనం ప్రారంభమైన తొలినాళ్లలో కొంత జాప్యం నెలకొంది. ట్యాబ్‌లలో నెలకొన్న సాంకేతిక సమస్యల వల్ల చాలా కేంద్రాల్లో మూల్యాంకనం ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకుంది. ఆ తర్వాత విద్యాశాఖ అధికారులు సాంకేతిక సమస్యలను పరిష్కరించడంతో విజయవంతంగా మూల్యాంకనం ప్రక్రియ సకాలంలో పూర్తి చేశారు.

కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మొత్తం 6,40,916 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 3,28,652 మంది, బాలికలు 3,12,264 మంది వరకు ఉన్నారు. మొత్తం 3,415 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఈ పరీక్షలు జరిగాయి. సరాసరిన 99.05 శాతం మంది పరీక్షలకు హాజరైనట్లు పరీక్షల విభాగం సంచాలకులు తెలిపారు. ఇక ఫలితాల కోసం విద్యార్ధులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మూల్యాంకనం తర్వాత మార్కుల ప్రాసెసింగ్‌ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అంతా సవ్యంగా జరిగితే మే మొదటి వారంలో పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.

తెలంగాణలో టెన్త్‌ ఫలితాలు 2026 ఎప్పుడంటే?

అటు తెలంగాణలోనూ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 13తో ముగిశాయి. మార్చి 24 నుంచి ఏప్రిల్ 13 వరకూ జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలోనూ పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.