
మధ్యతరగతి, వేతన జీవులకు పొదుపు అనేది భవిష్యత్తుకు భరోసా. సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టకపోతే అవసరానికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అందుకే ఆర్థిక నిపుణులు కూడా సంపాదనలో కొంత భాగాన్ని సురక్షితమైన పథకాల్లో దాచుకోవాలని సూచిస్తుంటారు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేని సాధారణ ఉద్యోగుల కోసం పోస్టాఫీస్ అందిస్తున్న అద్భుతమైన పథకమే రికరింగ్ డిపాజిట్. ఈ పథకంలో నెలకు కేవలం రూ.3,500 పెట్టుబడి పెట్టి రూ.2.5 లక్షలు ఎలా పొందవచ్చు. అవును.. ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఒకేసారి రూ.50 వేలు, లక్ష రూపాయలను డిపాజిట్ చేసే సదుపాయం లేని వారికి ఆర్డీ బెస్ట్ ఆప్షన్. ఇందులో మీరు ప్రతి నెలా మీ సంపాదన నుండి ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేసుకోవచ్చు. సాధారణంగా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది.
రూపాయి కూడా నష్టం ఉండదు
మార్కెట్ ఒడిదొడుకులు, షేర్ మార్కెట్ రిస్క్లు ఇష్టం లేని వారికి పోస్ట్ ఆఫీస్ పథకాలు నమ్మకమైన ఆప్షన్. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మీరు పెట్టే ప్రతి రూపాయికి పూర్తి రక్షణ ఉంటుంది. గడువు ముగిసిన తర్వాత వడ్డీతో సహా మీ డబ్బు మీ చేతికి రావడం ఖాయం. మీరు నెలకు రూ.3,500 చొప్పున 5 సంవత్సరాల పాటు పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఖాతాలో జమ చేస్తున్నారని అనుకుందాం..
- మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తం: రూ. 2,10,000 (రూ.3,500 × 60 నెలలు)
- ప్రస్తుత వడ్డీ రేటు: సంవత్సరానికి 6.7 శాతం
- మీకు వచ్చే వడ్డీ మాత్రమే: దాదాపు రూ. 39,240
- గడువు ముగిశాక చేతికి వచ్చే మొత్తం: రూ. 2,49,240
కేవలం రూ.100 తోనే ఖాతా తెరవొచ్చు
ఈ పథకం ప్రధాన సదుపాయం ఏంటంటే.. భారీ మొత్తంతో అకౌంట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదు. కేవలం నెలకు రూ.100తో కూడా మీరు ఈ ఆర్డీ ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ పైన రూ.10 చొప్పున గుణకాలలో ఎంతైనా పొదుపు మొత్తాన్ని పెంచుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.
లోన్ తీసుకునే అద్భుత సదుపాయం
ఖాతా తెరిచిన ఒక సంవత్సరం తర్వాత అత్యవసర పరిస్థితులు వస్తే మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ పై 50 శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంది. మీరు తీసుకున్న లోన్ మొత్తాన్ని ఒకేసారి లేదా నెలవారీ వాయిదాల రూపంలో తిరిగి చెల్లించవచ్చు. అంతేకాకుండా 5 సంవత్సరాల గడువు ముగిసిన తర్వాత కూడా మీకు ఈ పొదుపును కొనసాగించాలని ఉంటే మీరు దరఖాస్తు చేసుకుని ఖాతాను మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకోవచ్చు. దీనివల్ల చక్రవడ్డీ పెరిగి మీ మెచ్యూరిటీ అమౌంట్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.
ఎవరు అర్హులు? అకౌంట్ ఎలా తెరవాలి?
- 18 ఏళ్లు పైబడిన ఏ భారతీయ పౌరుడైనా ఒంటరిగా లేదా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- 10 ఏళ్లు పైబడిన మైనర్ల పేరిట కూడా తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు.
- మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్లి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి చాలా సులభంగా ఈ అకౌంట్ ప్రారంభించవచ్చు.
ప్రతి నెలా చిన్న మొత్తంలో పొదుపు చేస్తూ ఐదేళ్ల తర్వాత చేతికి ఒకేసారి పెద్ద మొత్తంలో నగదు అందుకోవాలనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ప్రైవేట్ ఉద్యోగులకు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ నిజంగా ఒక వరమనే చెప్పాలి.