
Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, అమరావతిలో రూ.2,500 కోట్ల విలువైన సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అమరావతి నిర్మాణానికి మరింత ఊతమివ్వనుంది. ప్రణాళిక ప్రకారం 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో అత్యాధునిక ఆఫీస్ కాంప్లెక్స్ను నిర్మించనున్నారు. ఇందులో రెండు భారీ టవర్లను ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే 1,800 కార్లకు పార్కింగ్ సదుపాయాన్ని కల్పించేలా ఆధునిక మౌలిక వసతులతో ఈ కార్యాలయ సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు.
ఇదే ప్రాజెక్టులో భాగంగా రూ.1,234 కోట్ల వ్యయంతో 17 ఎకరాల విస్తీర్ణంలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ను కూడా నిర్మించనున్నారు. 11 టవర్లలో మొత్తం 1,568 నివాస క్వార్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు పెమ్మసాని… గ్రీన్ ఎనర్జీ వినియోగం, కమ్యూనిటీ హాల్స్, ఆధునిక సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీగా ఈ నివాస సముదాయాన్ని అభివృద్ధి చేయనున్నారు. 2018లో తొలిసారిగా ప్రతిపాదించబడిన ఈ ప్రాజెక్టు పలు కారణాలతో ముందుకు సాగకపోయినా, 2024 తర్వాత వేగం పుంజుకుని ప్రస్తుతం ఆమోద దశకు చేరుకుంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, కేంద్ర ఆర్థిక శాఖల సమన్వయంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు లభించినట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం వల్లే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సాధ్యమైందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే అమరావతిలో పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కావడంతో పాటు రాజధాని అభివృద్ధికి కొత్త ఊపు లభించనుందని ఆయన అభిప్రాయపడ్డారు.