
- సీసీ ఫుటేజీ ద్వారా చోరీని గమనించి షోరూం వద్దకు స్టాఫ్
- వారిని తప్పించుకొని పారిపోయిన దుండగులు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం నగరంలోని వైరా రోడ్డులో ఉన్న సోనో విజన్ కంపెనీ షోరూంలో గురువారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. చోరీలో మొత్తం రూ. 70 లక్షల విలువైన ఫోన్లు పోయినట్లు నిర్వాహకులు తెలిపారు. పోలీసులు, షోరూం నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం… వైరా రోడ్డులో ఉన్న సోనో విజన్ షోరూం వద్దకు గురువారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నలుగురు వ్యక్తులు ఎర్టీగా కారులో వచ్చారు.
ఓ వ్యక్తి కారులోనే ఉండగా.. మిగతా ముగ్గురు షోరూం షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లారు. తర్వాత డిస్ప్లేలో ఉన్న ఫోన్లను తమ వెంట తెచ్చుకున్న కవర్లలో వేసుకున్నారు. విజయవాడలోని సోనో విజన్ సంస్థలో ఉన్న వ్యక్తులు సీసీ కెమెరాల ద్వారా చోరీదృశ్యాలను గమనించి వెంటనే ఖమ్మం షో రూం మేనేజర్కు సమాచారం ఇచ్చారు.
దీంతో ఇద్దరు వ్యక్తులు షోరూం వద్దకు చేరుకొని దుండగుల కారుకు బైక్ను అడ్డుపెట్టి ఆపే ప్రయత్నం చేశారు. కానీ దుండగులు వారిని తప్పించుకొని చోరీ సొత్తుతో పారిపోయారు. షోరూం మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేనేజర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం వన్టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్దత్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
క్లూస్ టీమ్ను రప్పించి దుండగుల వేలిముద్రలు, ఇతర ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు… షాపు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఈ చోరీలో మొత్తం రూ. 70 లక్షల విలువైన 150 నుంచి 160 ఫోన్లు పోయాయని, ఇందులో 9 ఐఫోన్లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.