
కామారెడ్డి, వెలుగు : ఆన్లైన్ బెట్టింగ్ల కారణంగా అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. టౌన్ సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం… జిల్లా కేంద్రంలోని ఎంఆర్ కాలనీకి చెందిన అంకం క్రాంతికుమార్ (40) ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు.
ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడిన క్రాంతికుమార్.. రూ. 12 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తిరిగి చెల్లించే అవకాశం లేకపోవడంతో మనస్తాపంతో బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
గురువారం ఉదయం రామారెడ్డి రోడ్డులోని చర్చి వెనుక వైపు ఉన్న చెట్టుకు ఓ వ్యక్తి ఉరి వేసుకోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించగా.. కొద్ది దూరంలో బైక్ కనిపించింది. వివరాల ఆధారంగా చనిపోయింది క్రాంతికుమార్గా గుర్తించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.